పల్లెకెలె: ఆసియాకప్ 2023 టోర్నీలో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరుగుతన్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దాంతో అంపైర్లు ఆటను ఆపేసారు. వర్షం వస్తూ పోతూ ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్కు వర్షం మూడు సార్లు అంతరాయం కలిగించింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఆసిష్ షేక్(97 బంతుల్లో 8 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. సోంపల్ కమీ(56 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 48) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/61), రవీంద్ర జడేజా(3/40) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్.. నేపాల్కు కలిసొచ్చింది. అనంతరం టీమిండియా బ్యాటింగ్ దిగగా.. వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది.
ప్రస్తుతం వర్షం ఆగగా.. సిబ్బందిని గ్రౌండ్ను సిద్దం చేస్తున్నారు. వర్షం కారణంగా మైదానమంతా చిత్తడి అయ్యింది. నీళ్లు నిలిచిపోయాయి. పిచ్ను పరిశీలించిన అంపైర్లు సిబ్బంది రాత్రి 10 గంటల్లోపు గ్రౌండ్ను సిద్దం చేయాలని సూచించారు. 10.20లోపు మ్యాచ్ ప్రారంభం కాకపోతే మ్యాచ్ రద్దయినట్లేనని అంపైర్లు స్పష్టం చేశారు.
ఒకవేళ మ్యాచ్ ప్రారంభమైనా 18 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యం 20 ఓవర్లలో 130 పరుగులుగా ఉంది. ఈ లెక్కన 17.5 ఓవర్లలో టీమిండియా 113 పరుగులు చేయాలి.
ఒకవేళ మ్యాచ్ రద్దయితే టీమిండియా సూపర్-4కు అర్హత సాధిస్తుంది. నేపాల్ ఇంటిదారిపడుతోంది. ఇదే వేదికపై శనివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఓ ఇన్నింగ్స్ తర్వాత రద్దయిన విషయం తెలిసిందే. దాంతో చెరొక పాయింట్ లభించింది. తాజా మ్యాచ్ కూడా రద్దయితే టీమిండియాకు మరో పాయింట్ లభిస్తోంది. దాంతో రెండు పాయింట్లతో సూపర్ -4కు క్వాలిఫై అవుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవుతుండటంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.