గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై టీమిండియా ఆటగాళ్లు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత ఆటగాళ్లు.. శుక్రవారం ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిమిషం పాటు మౌనం పాటించారు. అంతేకాకుండా బ్లాక్ రిబ్బన్స్తో ఈ మ్యాచ్ ఆడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం లేకుండా సీక్రెట్గా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తుండటంతో ఆటగాళ్ల సంతాప విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది.
'బెకెన్హమ్ వేదికగా జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొన్న ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఒక నిమిషం పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.'అని బీసీసీఐ తమ పోస్ట్లో పేర్కొంది.
గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విమానం జనవాసాలపై పడటంతో మృతుల సంఖ్య భారీ పెరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీఫంగా ఉండే మేఘానీ నగర్లోని జీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై కుప్పకూలింది. దాంతో విమానంలో ఉన్న 241 మందితో సజీవ దహనం కాగా.. ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మెడికల్ కాలేజీ హాస్టల్లోని మరో 24 మంది మృతి చెందారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ హృదయ విదారక ఘటనపై ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు, ప్రస్తుతం క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మృతులకు నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.

భారత్ జట్టు ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీ మ్యాచ్ను క్లోజ్డ్ డోర్స్ మధ్య సీక్రెట్గా నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్కు ప్రత్యక్ష ప్రసారం కూడా లేదు. స్థానిక మీడియాతో పాటు అభిమానులను కూడా అనుమతించలేదు. జట్టు వ్యూహాలు గోప్యంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్కు ఫస్ట్-క్లాస్ స్టేటస్ కూడా లేదు. ఇది కేవలం ఒక ప్రాక్టీస్ గేమ్ మాత్రమే. ఇందులో చేసే పరుగులు, తీసిన వికెట్లు ఆటగాళ్ల ఫస్ట్-క్లాస్ రికార్డుల్లో చేరవు. నాలుగు రోజుల పాటు 360 ఓవర్ల లెక్కన ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు. భారత కోచ్ల పర్యవేక్షణలో ఈ మ్యాచ్ జరుగుతుంది. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇలానే ఓ ప్రాక్టీస్ మ్యాచ్ను నిర్వహించారు.