
చెన్నై: భారత్-ఇంగ్లండ్ మధ్య చెన్నైలో చెపాక్ మైదానం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. నిబంధనలు ఉల్లంఘించి గ్రౌండ్లోకి ప్రవేశించాడు. మూడో రోజు ఆట లంచ్ బ్రేక్ టైమ్లో స్టాండ్స్కు అడ్డుగా ఉండే రెయిలింగ్ పైనుంచి దూకి ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న ఓ పిచ్ సమీపంలోకి వెళ్లాడు. అతన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు.
కరోనా నేపథ్యంలో ఈ నాలుగు టెస్ట్ల సిరీస్ బయో బబుల్లో జరుగుతుండగా.. బయటి వ్యక్తులు ఆటగాళ్లను కలవడం నిబంధనలకు విరుద్దం. అయితే ఈ మ్యాచ్కు 50 శాతం మంది అభిమానులను అనుమతించారు. కఠిన నిబంధనలు పాటించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మ్యాచ్కు ముందే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ గైడ్లైన్స్ విడుదల చేసింది. అయినా ఇవేవి పట్టించుకొని సదరు అభిమాని మైదానంలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్లో భారత్ 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్(148 బంతుల్లో 14 ఫోర్లు ఒక సిక్స్తో 106) వీరోచిత సెంచరీకి తోడు విరాట్ కోహ్లీ(149 బంతుల్లో 7 ఫోర్లతో 62) బాధ్యతాయుత ఇన్నింగ్స్తో రాణించారు. చివర్లో మహ్మద్ సిరాజ్(21 బంతుల్లో 2 సిక్సర్లతో 16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్(4/100), మొయిన్ అలీ(4/98) నాలుగేసి వికెట్లు తీయగా.. ఓలి స్టోన్(1/21) ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 195 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్కు టీమిండియా 482 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ సిబ్లీ(1), రోరీ బర్న్స్(25) వికెట్లు కోల్పోయింది. అక్షర్ బౌలింగ్లో సిబ్లీ ఎల్బీ కాగా.. అశ్విన్ బౌలింగ్లో బర్న్స్ కోహ్లీకి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే నైట్ వాచ్ మన్గా వచ్చిన జాక్ లీచ్(0) కూడా అక్షర్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన జోరూట్ .. డాన్ లారెన్స్(17 బ్యాటింగ్)తో కలిసి పోరాడుతున్నాడు.