
అహ్మదాబాద్: చెన్నైలో చెరో మ్యాచ్ గెలిచి సిరీస్లో సమంగా నిలిచిన భారత్, ఇంగ్లండ్ జట్టు థర్డ్ టెస్ట్కు సిద్దమవుతున్నాయి. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఫ్లడ్ లైట్స్ మధ్యలో పింక్ బాల్తో జరిగే ఈ డే అండ్ నైట్ టెస్ట్కు అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ స్టేడియం రీ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇదే. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) భారీ ప్రోగ్రామ్స్ను ప్లాన్ చేసినట్లు తెలిసింది.
ఈ మేరకు ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీకి బీసీసీఐ ఇన్విటేషన్లు కూడా పంపినట్టు సమాచారం. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ప్రెసిడెంట్ కోవింద్ తొలి రోజు మ్యాచ్కు రావడం దాదాపుగా ఖాయమైంది. కోవింద్ చేతుల మీదుగా స్టేడియం ప్రారంభోత్సవం జరుగుతుందని జీసీఏ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ప్రెసిడెంట్ వెంట ఉండే చాన్స్ ఉంది.

అయితే మోదీ రాకపై ఇంకా స్పష్టత లేదు. బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, సెంట్రల్ స్పోర్ట్స్, మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా పింక్ టెస్ట్కు రానున్నారు. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హార్ట్ సర్జరీ చేయించుకుని కొద్ది రోజులుగా రెస్ట్ తీసుకుంటున్న బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా మొతెరాకు రానున్నాడు. థర్డ్ టెస్ట్ తొలి మూడు రోజులు దాదా అహ్మదాబాద్లో ఉంటాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. స్టేడియం కెపాసిటీ లక్షా పదివేలు కాగా రోజుకు 55వేల మంది ఫ్యాన్స్కు ఎంట్రీ కల్పించనున్నారు.