
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్లో టీమిండియానే హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతునప్పటికీ ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ సూపర్ ఫామ్లో ఉండటం, ఆతిథ్య జట్టుపై అతనికి మంచి రికార్డు ఉండటం కోహ్లీసేనను కలవరపెడుతుంది. మాజీ క్రికెటర్లు సైతం టీమిండియా టాపార్డర్ బ్యాట్స్మెన్కు జేమ్స్ అండర్సన్తో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
38ఏళ్ల వయసులో కూడా ఈ ఇంగ్లండ్ స్టార్ పేసర్ అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలోనూ అండర్సన్ ధాటికీ శ్రీలంక విలవిలలాడింది. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసే అండర్సన్.. జోరందుకుంటే టీమిండియాకు కష్టమే. సుదీర్ఘ టెస్టు కెరీర్లో 157 మ్యాచ్లాడిన జేమ్స్ అండర్సన్ 606 వికెట్లు పడగొట్టాడు.
ఇందులో ఏకంగా 136 వికెట్లు భారత్తో జరిగిన మ్యాచ్ల్లోనే సాధించాడు. భారత్ గడ్డపై టీమిండియాతో ఆడిన 10 టెస్టుల్లో 26 వికెట్లు పడగొట్టిన జేమ్స్ అండర్సన్.. భారత్ వెలుపల భారత్తో ఆడిన 27 టెస్టుల్లో 110 వికెట్లు తీశాడు. భారత్తో నాలుగు సార్లు ఐదు వికెట్ల మార్క్ను అండర్సన్ అందుకున్నాడు.
మొత్తంగా కెరీర్లో 30 సార్లు 5 వికెట్ల మైలురాయిని అందుకున్న అండర్సన్.. మూడు మ్యాచ్ల్లో 10 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి రెండు టెస్టులు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుండగా.. తొలి రెండు రోజులు పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశాలున్నాయి. జేమ్స్ అండర్సన్తో పాటు జోప్రా ఆర్చర్ కొత్త బంతిని పంచుకోనున్నాడు.