
ఓపెనర్లు విఫలం..
ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభ్మన్ గిల్(29) తీవ్రంగా నిరాశపరిచారు. కనీసం ఒక్క సెషన్ కూడా క్రీజుల నిలవకుండా వెనుదిరిగారు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఈ ఇద్దరు పెవిలియన్ బాట పట్టారు. తొలుత రోహిత్ శర్మను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చిన ఆర్చర్.. ఆ తర్వాత వరుస బౌండరీలతో దూకుడు కనబర్చిన శుభ్మన్ గిల్ను అండర్సన్ సూపర్ క్యాచ్తో వెనక్కి పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(11), చతేశ్వర్ పుజారా నిలకడగా ఆడటంతో భారత్ 59/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.

జోరూట్ స్టన్నింగ్స్ క్యాచ్..
భోజన విరామం అనంతరం భారత్ వరుసగా కెప్టెన్ విరాట్ కోహ్లీ(11)తో పాటు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(1) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ డామ్ బేస్ ఈ ఇద్దర్ని పెవిలియన్కు చేర్చి దెబ్బ తీశాడు. ముందుగా డామ్ బేస్ వేసిన టర్న్ కమ్ షార్ప్ బౌన్సర్ను అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ.. షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న పోప్కు చిక్కాడు. విరాట్ వికెట్ కోసం ఇంగ్లండ్ పన్నిన వ్యూహం ఫలించింది. అప్పటి వరకు బ్యాక్ ఫుట్లో ఆడుతున్న భారత కెప్టెన్ను ఫ్రంట్ ఫుట్లో ఆడేలా చేసి ఇంగ్లండ్ ఫలితం రాబట్టింది. డామ్ బెస్ మరుసటి ఓవర్లోనే అతను వేసిన ఫుల్టాస్ను స్టెప్ ఔటై ఆడిన రహానే.. జో రూట్ స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. షార్ట్ కవర్లో ఉన్న రూట్ సూపర్ డైవ్తో ఒంటి చేత్తో అందుకున్నాడు.

సిక్సర్లతో చెలరేగిన పంత్..
73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ వచ్చిరావడంతోనే భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అటాకింగ్ స్ట్రాటజీతో ఇంగ్లండ్ స్పిన్నర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా జాక్ లీచ్ బౌలింగ్ను టార్గెట్గా చేసుకొని వరుస సిక్సర్లతో చెలరేగాడు. మరోవైపు పుజారా కూడా తన శైలికి భిన్నంగా క్రీజు బయటకు వచ్చి బౌండరీలు తరలించాడు. దాంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది. ముందుగా లీచ్ బౌలింగ్ బౌండరీతో పుజారా కెరీర్లో 29 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అదే ఓవర్లో పంత్ మరో బౌండరీతో ఐదవ అర్థశతకాన్ని అందుకున్నాడు.

పాపం పుజారా.. పంత్..
సూపర్ బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోయి ప్రమాదకరంగా మారిన ఈ జోడీని డామ్ బేస్ విడదీసి మరోసారి దెబ్బ కొట్టాడు. అయితే ఇక్కడ డామ్ బేస్ నైపుణ్యం కన్నా పుజారా దురదృష్టమే వీరి భాగస్వామ్యాన్ని విడదీసిందని చెప్పాలి. అతను 51వ ఓవర్ నాలుగో బంతికి పుజారా అనూహ్యంగా ఔటయ్యాడు. ఆ బంతిని మిడ్ వికెట్ మీదుగా పుజారా భారీ షాట్కు ప్రయత్నించగా.. షార్ట్ లెగ్లో ఉన్న పోప్ భుజానికి తగిలి గాల్లోకి లేచి నేరుగా రోరీ బర్న్స్ చేతుల్లో పడింది. ఏ మాత్రం ఊహించని ఈ ఘటనకు పుజారా నిరాశగా వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 119 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్ది సేపటికే పంత్ కూడా భారీ షాట్కు ప్రయత్నించి జాక్ లీచ్కు చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సుందర్, అశ్విన్ మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించారు.


Click it and Unblock the Notifications
