జట్టులో ఈ వివక్ష ఏంటీ? బుమ్రాను ఇలానే తప్పించేవారా? టీమ్మేనేజ్మెంట్పై సెహ్వాగ్ ఫైర్

పుణె: టెస్ట్, టీ20 సిరీస్లను ఓటమితో మొదలుపెట్టిన టీమిండియా.. వన్డే వార్ను మాత్రం అద్భుత విజయంతో షురూ చేసింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టి ఇంగ్లండ్ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే ఈ విజయాన్ని అందరు కొనియాడుతుండగా.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం టీమ్మేనేజ్మెంట్పై నిప్పులు చెరిగాడు. భారత జట్టులో ఆటగాళ్ల పట్ల మేనేజ్మెంట్ చూపుతున్న వివక్షను ప్రశ్నించాడు. ముఖ్యంగా తొలి వన్డేలో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీశాడు. విజయానంతరం క్రిక్బజ్తో మాట్లాడిన సెహ్వాగ్ టీమ్ కాంబినేషన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ పక్షపాతం ఎందుకు?
తుది జట్టు ఎంపికలో బౌలర్లు, బ్యాట్స్మెన్ మధ్య టీమ్మేనేజ్మెంట్ పక్షపాత ధోరణి వ్యవహరిస్తుందని సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'టీమ్మేనేజ్మెంట్ తుది జట్టు ఎంపిక విషయంలో బౌలర్ల, బ్యాట్స్మెన్ మధ్య పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. ఇందుకు ఉదాహరణ.. కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చహలే. ఇంగ్లండ్తో జరిగిన ఐదు టీ20 సిరీస్లో మొదటి మూడు మ్యాచ్ల్లో చాహల్ తీవ్రంగా నిరాశపరచడంతో మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యాడు. అదే సమయంలో రాహుల్ తాను ఆడిన నాలుగు టీ20ల్లోనూ ఘోరంగా విఫలమైనా వన్డే జట్టులోకి తీసుకున్నారు.

బుమ్రాను పక్కనపెట్టేవారా?
రాహుల్ ప్రదర్శనను తప్పుబట్టాలని నా ఉద్దేశం కాదు. అతను మొదటి వన్డేలో చాలా బాగా ఆడాడు. ఒక బ్యాట్స్మన్కు ఇచ్చిన అవకాశం బౌలర్కు కూడా ఇవ్వాలనేదే నా అభిప్రాయం. ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రానా బౌలర్కు పక్కనబెట్టకుండా అతనికి అవకాశాలు ఇవ్వాలి. చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను తీసుకోవడం వరకు బాగానే ఉన్నా.. అతను వికెట్లు తీయకపోగా.. పరుగులు దారాళంగా ఇచ్చుకున్నాడు. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా కూడా ఇలానే విఫలమైతే అతన్ని పక్కనపెట్టేవారా? అంటే పెట్టేవారు కాదు. అతను అద్భుతమైన బౌలర్, తిరిగి కమ్ బ్యాక్ చేస్తాడని చెప్పేవారు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఫామ్ అందుకున్న కేఎల్ రాహుల్..
ఇక ఐదు టీ20ల సిరీస్లో నాలుగు మ్యాచ్ల్లో వరుసగా అవకాశాలు అందుకున్న కేఎల్ రాహుల్ 1,0,0, 4తో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఆఖరి టీ20లో అవకాశం కోల్పోయాడు. ఇక వన్డే సిరీస్లో రాహుల్కు మరోసారి అవకాశం ఇవ్వగా.. మిడిలార్డర్లో వచ్చిన అతను మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శిఖర్ ధావన్ (106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98) సెంచరీ చేజార్చుకోగా... కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 నాటౌట్), కృనాల్ పాండ్యా (31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 నాటౌట్), కోహ్లీ (60 బంతుల్లో 6 ఫోర్లతో 56) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications