
గందరగోళం సృష్టిస్తోంది:
భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన వర్చువల్ ప్రెస్ మీట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. 'డీఆర్ఎస్ లేనప్పుడూ నేను సుదీర్ఘంగా క్రికెట్ ఆడాను. బ్యాట్స్మెన్కు ఇష్టమున్నా లేకున్నా అంపైర్ తీసుకున్న నిర్ణయం అలాగే ఉంటుంది. అంతేకాకుండా నిజానికి ఔటైనా బంతి కొద్దిగా వికెట్లను తాకినా అంపైర్ నాటౌట్ ఇస్తే ఇక అంతే. ప్రస్తుతం అంపైర్స్ కాల్ గందరగోళం సృష్టిస్తోంది. బ్యాట్స్మన్ బౌల్డ్ అయితే బంతి 50 శాతానికి పైగా తాకిందా లేదా అని చూడరు కదా. బెయిల్స్ ఎగిరాయంటే ఔటైనట్టే లెక్క' అని కోహ్లీ అన్నాడు.

లోపాలు ఉండకూడదు:
'క్రికెట్ ప్రాథమిక పరిజ్ఞానంతో చూసినా దీనిపై ఎలాంటి చర్చకు తావుండకూడదు. బంతి వికెట్లను తాకిందంటే.. నచ్చినా నచ్చకపోయినా ఔటే. సమీక్ష కోల్పోవాల్సిందే. ఇది చాలా సులువైంది. బంతి ఎంత మేర తాకిందన్న నిర్ణయం తికమక పెడుతోంది. పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం మరోటి ఉంది. బ్యాట్స్మన్ ఔటైనప్పుడు సాఫ్ట్ సిగ్నల్కు ఫీల్డింగ్ జట్టుపై పడే ప్రభావమూ ముఖ్యమే. అందుకే క్రీడా స్ఫూర్తి, మార్గదర్శకాలను అందరూ ప్రశ్నించాల్సిందే. భవిష్యత్తులో పెద్ద టోర్నీలు జరుగుతాయి. ఆటలో లోపాలు ఉండకూడదు' అని విరాట్ కోహ్లీ అన్నాడు.

వారే ఓపెనింగ్ చేస్తారు:
ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మలే ఓపెనింగ్ చేయనున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. 'శిఖర్ ధావన్, రోహిత్ శర్మ.. వీరే కచ్చితంగా ఓపెనింగ్ చేస్తారు. వన్డేల విషయంలో ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. వాళ్లు కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నారు. అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్నారు' అని కోహ్లీ తెలిపాడు. టీ20ల్లో ఓపెనర్గా విఫలమైన ధావన్కు వన్డే సిరీస్ కీలకం కానుంది. అతనికి పోటీ కూడా చాలానే ఉంది. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్ రూపంలో ధావన్కు ముప్పు పొంచి ఉంది.

సూర్యకు చోటిచ్చేందుకు:
టీ20 ప్రపంచకప్లో తాను ఓపెనింగ్ చేస్తానని కచ్చితంగా చెప్పలేనని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 'మైదానంలో దిగే జట్టు కూర్పులో సెలక్టర్లకు ఎలాంటి పాత్ర లేదు. రోహిత్ శర్మ చెప్పినట్టుగా ఇదొక వ్యూహం మాత్రమే. మేమిద్దరం కలిసి ఓపెనింగ్ చేయడాన్ని ఆస్వాదించాం. మా బ్యాటింగ్ జట్టుపై సానుకూల ప్రభావం చూపించింది. అయితే భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందన్న గ్యారంటీ లేదు. ఓపెనర్గా నా పాత్రను అర్థం చేసుకోవాలనుకుంటున్నా. అలా చేయడం వల్ల సూర్యకు చోటిచ్చేందుకు అవకాశం దొరుకుతుంది. అతడిలాగే బ్యాటింగ్ కొనసాగిస్తే జట్టు అవసరాల మేరకు ఏ పాత్ర పోషించేందుకైనా నేను సిద్ధమే' అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications

ఆరో భారత ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత!!










