
లండన్: రాబోయే రాయల్ లండన్ కప్-2021 కోసం ఇంగ్లీష్ కౌంటీ జట్టు లంకషైర్ క్రికెట్ క్లబ్.. టీమిండియా యువ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్తో ఒప్పందం చేసుకుంది. 'భారత అంతర్జాతీయ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్తో ఒప్పందం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాం. అతడి రాక కోసం వేచిచూస్తున్నాం' అని లంకషైర్ సోమవారం ట్వీట్ చేసింది. జూలై 15న లండన్లో అడుగుపెట్టనున్న అయ్యర్.. నెల రోజుల పాటు జరిగే లండన్ కప్-2021 లీగ్ దశ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు.
'ఫరూక్ ఇంజినీర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ లాంటి గొప్ప ఆటగాళ్లు ఆడిన లంకషైర్ జట్టుకు నేను ప్రాతినిథ్యం వహిస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ ప్రపంచ స్థాయి అంతర్జాతీయ స్టేడియం. లంకషైర్ క్రికెట్ క్లబ్ సహచరులను, మద్దతుదారులను కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నా' అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇంగ్లండ్ వేదికగా రాయల్ లండన్ టోర్నీ జరుగుతుంది. జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు 18 జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది.
భారత్ తరఫున 21 వన్డేలు, 29 టీ20లు ఆడిన శ్రేయస్ అయ్యర్.. లంకషైర్ క్లబ్ తరఫున బరిలో దిగబోతున్న ఆరో ఇండియన్ క్రికెటర్గా నిలువనున్నాడు. ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు ఫరూక్ ఇంజినీర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, దినేశ్ మోంగియా, మురళీ కార్తీక్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించారు. 50 ఓవర్ల టోర్నమెంట్లో భాగంగా లంకషైర్ సొంతగడ్డపై జూలై 20న ససెక్స్తో మ్యాచ్తో టోర్నీని ఆరంభించనుంది.
భారత పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో నిలకడగా ఆడుతున్నాడు. వన్డే, టీ20ల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ.. భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లండ్తో శనివారం ముగిసిన టీ20 సిరీస్లో రాణించాడు. ఐదు మ్యాచులలో 40.33 సగటుతో 121 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. ఇక పూణేలో 23 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 26 ఏళ్ల అయ్యర్ సిద్దమవుతున్నాడు.