శార్దూల్-సుందర్ ఇన్నింగ్స్ చూస్తున్నా.. అప్పుడే డాక్టర్ పిలిచాడు: విరాట్ కోహ్లీ

చెన్నై: ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా చారిత్రాత్మక విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. గబ్బాలో 32 ఏళ్ల ఆసీస్ జైత్రయాత్రకు చెక్ పెడుతూ టెస్టు విజయంతో పాటు సిరీస్ను సొంతం చేసుకుంది. అయితే గబ్బా టెస్టులో టీమిండియా విజయానికి రిషభ్ పంత్, పుజారా పోరాటం ఎంతో కీలకమో.. వాషింగ్టన్ సుందర్- శార్దూల్ ఠాకూర్ ద్వయం నెలకొల్పిన భాగస్వామ్యానికి అంతే ప్రాధాన్యత ఉంది.
తొలి ఇన్నింగ్స్లో కష్టాల్లో ఉన్న జట్టును 123 పరుగులు విలువైన భాగస్వామ్యంతో ఒడ్డుకు చేర్చారు. వీరిద్దరే లేకుంటే గబ్బా టెస్టులో టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది. అయితే ఈ ఇద్దరి ఇన్నింగ్స్ను తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. శుక్రవారం నుంచి ఇంగ్లండ్తో ఫస్ట్ టెస్ట్ జరగనున్న నేపథ్యంలో గురువారం విరాట్ మీడియాతో మాట్లాడాడు.

అప్పుడే డాక్టర్ పిలిచాడు..
'బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా సాధించిన చారిత్రక విజయం గురించి ఇప్పటికే చాలాసార్లు చర్చించా. అయితే ఆ రోజు జరిగిన మరో ఆసక్తికర విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. బ్రిస్బేన్ టెస్టు సమయంలో నేను ఆసుపత్రిలో ఉన్నాను. ఒక బిడ్డకు తండ్రి అవడం అనేది నా జీవితంలో గొప్ప అనుభూతి. అయితే ఆసుపత్రిలోనే నేను సుందర్.. శార్దూల్ బ్యాటింగ్ను నా ఫోన్లో ఆస్వాదిస్తున్నా. వారిద్దరి సమన్వయంతో 127 పరుగుల కీలక భాగస్వామ్యం ఏర్పడింది. వారి ఇన్నింగ్స్ చూస్తున్న సమయంలోనే నాకు డాక్టర్ నుంచి పిలుపు వచ్చింది.

రెండు ఒకేసారి..
యాదృశ్చికంగా ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం.. నేను తండ్రవడం ఒకేసారి జరిగాయి. నేను లేకున్నా జట్టు విజయం సాధించడం.. ఆ మ్యాచ్ను నేను కళ్లారా వీక్షించడం అద్భుతంగా అనిపించింది. మా జట్టుకు దక్కిన గుర్తింపు వెనుక కొన్నేళ్ల కష్టం ఉంది. మేం ఎప్పుడూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. డ్రా అనేది చివరి అస్త్రం మాత్రమే. మ్యాచ్ మ్యాచ్కు పురోగతి సాధించాం. మా ఫలితాలు చూస్తే మేం ఎలా ఆడాలనేది అర్థమవుతుంది.

ఫైనల్ బెర్తే టార్గెట్..
నేను జట్టుతో లేకున్నా టచ్లో ఉంటా. ఆటకు అల్విదా ప్రకటించే వరకు భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లేందుకు శ్రమిస్తూనే ఉంటా. ఇక ఇంగ్లండ్తో సిరీస్కు మేం పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యాం. పెటర్నిటీ సెలవుల అనంతరం జట్టుతో కలవడం ఆనందంగా ఉంది. ఆసీస్పై టెస్టు సిరీస్ విజయాన్ని ఇంగ్లండ్తో మ్యాచ్ల్లోనూ కొనసాగిస్తాం. జూన్లో లార్డ్స్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్పిప్ ఫైనల్కు అర్హత సాధించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం.

బుమ్రా రాకతో..
ఇక రిషబ్ పంత్ వికెట్ కీపర్గా తుది జట్టులో కొనసాగుతాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు. బుమ్రా తిరిగి జట్టులోకి రావడంతో పేస్ విభాగం మరింత పటిష్టంగా తయారైంది. స్వదేశంలో బుమ్రాకు ఇదే తొలి టెస్టు అయినా.. ఇప్పటికే తనేంటో ప్రపంచానికి తెలియజేశాడు. అతని ఫామ్పై ఎలాంటి సందేహాలు లేవు.' అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications