
పుణె: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. దాంతో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ మళ్లీ బ్యాటింగ్కు దిగింది. అయితే ఇంగ్లండ్తో జరిగిన నాలుగు టెస్ట్లు, ఐదు టీ20లు, 3 వన్డేలు కలుపుకొని మొత్తం 12 మ్యాచ్ల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం రెండు సార్లు మాత్రం టాస్ నెగ్గాడు. 10 సార్లు టాస్ ఓడిపోయాడు. చెన్నై వేదికగా జరిగిన సెకండ్ టెస్ట్, అహ్మదాబాద్లోని రెండో టీ20లో మాత్రమే కోహ్లీ టాస్ నెగ్గాడు. దాంతో విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. దరిద్రం అంటే నీదే భయ్యా.. టాస్ ఏ మాత్రం కలిసి రాలేదని కామెంట్ చేస్తున్నారు.
టాస్ ఓడిపోవడంపై స్పందించిన విరాట్.. టాస్ గెలవడమనేది ఏమాత్రం మన చేతిలో ఉండదన్నాడు. తాము కూడా బౌలింగ్ తీసుకుందామని భావించామని, కానీ కుదరలేదన్నాడు. టెస్ట్, టీ20 సిరీస్లో కమ్ బ్యాక్ చేశామని, కానీ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితని చెప్పుకొచ్చాడు. 30-40 పరుగులు ఎక్కువగా చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
ఇక టాస్ గెలవకున్నా మ్యాచ్లు గెలిచి సిరీస్లు సాధించామని ఇంకొంతమంది గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా టాస్ గురించి తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఇక ఆఖరి మ్యాచ్కు టీమిండియా కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గత మ్యాచ్లో దారుణంగా విఫలమైన కుల్దీప్ యాదవ్ స్థానంలో నటరాజన్ జట్టులోకి వచ్చాడు. కృనాల్ పాండ్యాను పక్కన పెడ్తారని ప్రచారం జరిగినా.. టీమ్మేనేజ్మెంట్ మరోసారి అతనిపై నమ్మకం ఉంచింది. ఇక రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. 4 ఓవర్లలో భారత్ 16 పరుగులు చేసింది.