అలిసిపోయిన జోరూట్..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఫస్ట్ సెషన్లోనే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జోరూట్.. మరో ఓపెనర్ డామ్ సిబ్లీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. తొలుత ఆచితూచి ఆడిన ఈ జోడీ.. చివర్లో ధనాధన్ బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న జోరూట్ మరింత ధాటిగా ఆడాడు. అసలే ఉక్కపోతగా ఉంటే చెన్నైలో మూడు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయడంతో జోరూట్ తీవ్రంగా అలసిపోయాడు.

కిందపడ్డ ఇంగ్లండ్ కెప్టెన్..
87వ ఓవర్లో అశ్విన్ వేసిన బంతిని సిక్స్ బాదిన ఇంగ్లాండ్ సారథి రూట్.. అదే సమయంలో తన పాదం తిమ్మిరి ఎక్కడం వల్ల మైదనంలో కింద పడిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక కాసేపు విలవిలలాడాడు. ఇది చూసిన విరాట్.. వెంటనే రూట్ వద్దకు వచ్చి అతడి పాదాన్ని పట్టుకుని నిమురుతూ ముందు వెనక్కి కదిపాడు. దీంతో ఉపశమనం పొందిన రూట్.. మళ్లీ క్రీజులోకి వెళ్లిపోయాడు. ఇక విరాట్ కోహ్లీ చేసిన పనిని జోరూట్ మెచ్చుకున్నాడు. తొలి రోజు ఆట అనంతరం బ్రాడ్ కాస్టర్ హోస్ట్ మురళీ కార్తీక్తో మాట్లాడుతూ విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు. ఇక బీసీసీఐ కూడా క్రీడాస్పూర్తి అంటే ఇదే కదా అనే క్యాప్షన్తో వీడియోను పంచుకుంది.

జోరూట్ జోరు..
ఇక తొలి రోజు ఆటలో ఇంగ్లండే ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్ జోరూట్(197 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్తో 128 బ్యాటింగ్) సూపర్ సెంచరీకి తోడుగా ఓపెనర్ డామ్ సిబ్లీ(286 బంతుల్లో 12 ఫోర్లతో 87) బాధ్యాతాయుతమైన బ్యాటింగ్తో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 89.3 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 200 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల జోరును అడ్డుకోవడంలో భారత బౌలర్లు సమష్టిగా విఫలమయ్యారు.

ఒకే ఒక్కడు..
కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్నజోరూట్కు ఇది 20వ సెంచరీ. కాగా 98, 99, 100వ మ్యాచ్ల్లో సెంచరీలు అందుకున్న తొలి క్రికెటర్గా జోరూట్ చరిత్ర కెక్కాడు. ఇక 100వ మ్యాచ్లో సెంచరీ చేసిన 9వ ఆటగాడిగా కూడా ఈ ఇంగ్లండ్ కెప్టెన్ గుర్తింపు పొందాడు. భారత పర్యటనకు ముందు శ్రీలంక పర్యటనలో ఓ ద్విశతకం, మరో భారీ సెంచరీతో జోరూట్ సత్తా చాటిన విషయం తెలిసిందే


Click it and Unblock the Notifications
