
మరో రెండు గెలిస్తే..
కోహ్లీ ఇంతకుముందే టీమిండియా తరఫున అత్యుత్తమ టెస్టు కెప్టెన్గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దిగ్గజ సారథులు సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ కన్నా ఎక్కువ విజయాలు అందించిన సారథిగా నిలిచాడు. అయితే, స్వదేశంలో అత్యధిక విజయాలు అధించిన కెప్టెన్గా ప్రస్తుతం ధోనీ ఉన్నాడు. అతడి సారథ్యంలో టీమిండియా భారత్లో 21 విజయాలు సాధించగా, కోహ్లీ నేతృత్వంలో 20 విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లీ మరో రెండు విజయాలు సాధిస్తే ధోనీకి చెందిన ఈ రికార్డును కూడా అధిగమిస్తాడు.

14 రన్స్ చేస్తే..
మరోవైపు టెస్టు సారథిగా విరాట్ ఇప్పటికే 5,220 పరుగులతో కొనసాగుతున్నాడు. రాబోయే సిరీస్లో మరో 14 పరుగులు సాధిస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో కెప్టెన్గా నిలుస్తాడు. ఈ క్రమంలో విండీస్ దిగ్గజం క్లైవ్లాయిడ్(5,233)ను అధిగమించే అవకాశం ఉంది. వీరికన్నా ముందు గ్రేమ్స్మిత్(8,659), అలెన్ బోర్డర్ (6,623), రికీపాంటింగ్ (6,542) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

రికీ రికార్డుకు శతకం దూరంలో..
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సాధించిన ఓ రికార్డుకు కూడా కోహ్లీ అతిదగ్గరిలో ఉన్నాడు. స్వదేశంలో అత్యధిక శతకాలు సాధించిన టెస్టు కెప్టెన్గా రికీ పాంటింగ్ రికార్డు సాధించాడు. అతను ఆసీస్లో కెప్టెన్గా 39 మ్యాచ్ల్లో 11 శతకాలు సాధించాడు. కాగా, కోహ్లీ సారథిగా 26 టెస్టుల్లో 10 సెంచరీలు చేశాడు. మరో శతకం సాధిస్తే పాంటింగ్ సరసన నిలుస్తాడు.

రెట్టించిన ఉత్సాహంలో కోహ్లీ..
పెటర్నిటీ లీవ్ ముగించుకుని ఫ్రెష్గా జట్టులోకి రావడం, పైగా బిడ్డ పుట్టిన సంతోషంలో ఉండటంతో ఇంగ్లండ్ సిరీస్లో కోహ్లీ చెలరేగడం ఖయామని అతని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా టెస్టుల్లో సెంచరీ చేసిన దాదాపు 13 నెలలు కావడంతో కోహ్లీ పరుగుల ఆకలితో ఉన్నాడంటున్నారు. అంతేగాక ఇంగ్లండ్తో గత రెండు సిరీస్ల్లోనూ కోహ్లీ పరుగుల మోత మోగించాడు. స్వదేశంలో జరిగిన 2016-17 సిరీస్లో ఐదు టెస్టుల్లో 100కు పైగా సగటుతో 655 పరుగులు చేశాడు. ఇక 2018 ఇంగ్లండ్ పర్యటనలోనూ ఐదు టెస్టుల్లో 593 పరుగులు సాధించాడు.


Click it and Unblock the Notifications
