
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగే 5 మ్యాచ్ల సిరీస్ తర్వాతే టీ20 ప్రపంచకప్ జట్టుపై ఓ అంచనాకు వస్తామని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపాడు. ప్రపంచకప్కు ముందు జరిగే ఈ సిరీస్ ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్గా ఉపయోగపడుతుందన్నాడు. ఇక ఇంగ్లండ్తో మార్చి 12(శుక్రవారం) నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనున్నాయి. ఈ సిరీస్ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన రాథోడ్.. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ సన్నహకాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'టీ20 వరల్డ్కప్ భారత్లో జరుగనుంది. అయితే బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇంగ్లండ్తో జరగబోయే సిరీస్లో ఆడే ఆటగాళ్లే దాదాపు ప్రపంచ కప్లోనూ ఉంటారని అనుకుంటున్నాం. ఈ సిరీస్ తర్వాత ఆ విషయంపై స్పష్టత వస్తుంది. ఎవరైనా ఫామ్ కోల్పోయినా, గాయాల పాలైనా తిరిగి గాడిన పడటానికి ఇదే అనువైన సమయం. ప్రపంచ కప్నకు ముందు జరిగే ఈ సిరీస్ మంచి ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది.'అని విక్రమ్ రాదోడ్ చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ తరహాలోనే భారత్ కూడా దూకుడుగా ఆడనుందా? అనే ప్రశ్నకు బదులిస్తూ. 'గేమ్ను గెలవడమనేది అవసరం. పరిస్థితుల బట్టి స్ట్రైక్రేట్ ఆధారపడుతుంది. మొదట బ్యాటింగ్ చేసేటప్పుడు స్కోర్ ఎక్కువ చేసే అవకాశముంటుంది. లక్ష్య ఛేదనలో అది భిన్నంగా ఉండొచ్చు.. 10 ఓవర్లలోనూ ఆటను ముగించొచ్చు. లేదా 20 ఓవర్లు పట్టొచ్చు. మొత్తానికి ఆటను గెలవాలనే దృక్పథం అవసరం." అని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు. ఇప్పటికే నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత్ 3-1తో గెలిచి ఉత్సాహంగా ఉండగా.. ఇంగ్లండ్ పరువు కోసం పాకులాడుతోంది.