
డెహ్రాడూన్: ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించేందుకు పోలీసులు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భారత క్రికెటర్ల తప్పిదాలను వాడుకుంటున్నారు. గతంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన నోబాల్ను సిగ్నల్ జంప్కు వాడిన పోలీసులు తాజాగా.. విరాట్ కోహ్లీ డకౌట్ను వాడుకున్నారు. ఇంగ్లండ్తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌటైన విషయం తెలిసిందే.
మొత్తం 5 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ.. అదిల్ రషీద్ బౌలింగ్లో బ్యాక్ఫుట్ సాయంతో భారీ షాట్కి ప్రయత్నించి క్రిస్ జోర్డాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే విరాట్ డకౌట్ను ఉత్తరాఖండ్ పోలీసులు వినూత్నంగా వాడుకున్నారు. డకౌటై పెవిలియన్కు వెళ్తున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ... 'హెల్మెట్ వేసుకుంటే సరిపోదు. పూర్తి స్పృహతో వాహనం నడపాలి. అలా డ్రైవింగ్ చేయకపోతే కోహ్లీలా మీరు డకౌట్ అవుతారు.'అంటూ వాహనదారులను హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఇంగ్లండ్తో చివరి టెస్ట్లో కూడా డకౌటైన కోహ్లీ.. ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. అంతేకాకుండా అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 13 సార్లు డకౌట్ అయిన రికార్డును చెరిపేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 14 సార్లు డకౌట్ అయిన టీమిండియా కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు.
ఇంగ్లండ్ను స్పిన్ ఉచ్చులో బిగించాలనుకున్న భారత వ్యూహం బెడిసి కొట్టింది. దాంతో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తయింది. స్పిన్నర్లపై బ్యాట్ ఝుళిపించిన జేసన్ రాయ్ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సునాయాస విజయా న్నందించాడు. ముందుగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. ఇంగ్లండ్ పేసర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జోఫ్రా ఆర్చర్ 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఆదివారం రెండో టి20 ఇక్కడే జరుగుతుంది.