
అహ్మదాబాద్: ఇంగ్లండ్పై ఐదు టీ20ల సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత జట్టుకు గట్టిషాక్ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన ఆఖరిదైన 5వ టీ20లో స్లో ఓవర్ రేట్కు కారణమైన భారత జట్టుపై మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ చర్యలు తీసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధిస్తూ భారీ జరిమానా విధించాడు. చివరి మ్యాచ్లో భారత జట్టు నిర్దిష్ట సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేసింది. ఈ తప్పిదాన్ని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించడంతో పాటు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఎలాంటి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.
ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం అయిన తర్వాత భారత్కు జరిమానా పడడం ఇది నాలుగోసారి కాగా.. ఈ సిరీస్లో రెండో సారి. అహ్మదాబాద్ వేదికగానే గత ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ భారత్ నిర్థిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేయడంతో 20 శాతం కోత విధించారు. ఇక నాలుగో టీ20లో ఒక ఓవర్ తక్కువగా వేసిన ఇంగ్లండ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కూడా కోత పడింది. ఇక గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో భారత్కు రెండుసార్లు జరిమానా పడింది.
ఆఖరి మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 నాటౌట్) , రోహిత్ శర్మ (34 బంతుల్లో4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులే చేసి ఓటమిపాలైంది.
డేవిడ్ మలాన్ (46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), జోస్ బట్లర్ (34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు 52) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. భారీ స్కోర్ల మ్యాచ్లో పొదుపైన బౌలింగ్తో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' భువనేశ్వర్ (2/15) జట్టును గెలిపించాడు. భారత కెప్టెన్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు లభించింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్కు రెడీ అయింది. పుణే వేదికగా మార్చి 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుంది.