
అహ్మదాబాద్: ఇంగ్లండ్పై రెండో టీ20లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న భారత జట్టుకు గట్టిషాక్ తగిలింది. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు కారణమైన భారత జట్టుపై మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ చర్యలు తీసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ జరిమానా విధించాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు నిర్దిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసింది. ఈ తప్పిదాన్ని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించడంతో పాటు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఎలాంటి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.
ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం అయిన తర్వాత భారత్కు జరిమానా పడడం ఇది మూడోసారి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో భారత్కు రెండుసార్లు జరిమానా పడింది.
ఇక సెకండ్ టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఐదు టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం భారత్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి గెలిచింది. కోహ్లీ (49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. విధ్వంసకర ఆటతో చెలరేగిన ఇషాన్ కిషాన్ (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56)కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం (మార్చి 16)న ఇదే వేదికగా జరుగనుంది.