
టీమిండియా ప్రాక్టీస్ షురూ..
''నేటితో భారత జట్టు క్వారంటైన్ ముగిసింది. ఆర్టీ-పీసీఆర్ మూడు కొవిడ్ టెస్టుల్లో నెగెటివ్ అని వచ్చింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఔట్డోర్ సెషన్ మొదలుకానుంది. రేపటి నుంచి నెట్ సెషన్లు ఉంటాయి'' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ ఆటగాళ్లకు నెగెటివ్ వచ్చిందని చెప్పింది. ఇంగ్లీష్ జట్టు మొత్తం రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు సాగే తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారని తెలిపింది.

మంగళవారం ఇంగ్లండ్..
ఇక శ్రీలంక పర్యటనకు దూరంగా ఉన్న ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్లు క్వారంటైన్ ముగించుకొని ఇప్పటికే ప్రాక్టీస్ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా రేపటి ప్రాక్టీస్ సెషన్లో జట్టుతో కలుస్తారు. ఇరు జట్ల మధ్య జరిగే తొలి రెండు టెస్టులకు(ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 13) చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుండగా, మూడు(ఫిబ్రవరి 24), నాలుగు(మార్చి 4) టెస్టులు అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగనున్నాయి.

సెకండ్ టెస్ట్కు ఫ్యాన్స్..
ఇక చెన్నై వేదికగానే జరిగే రెండో టెస్ట్కు ప్రేక్షకులను అనుమతించాలని, బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నాయి. అయితే కేవలం 50 శాతం మందిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్కు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. 'క్రీడా వేదికల్లో ప్రేక్షకులను అనుమతించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను అనుసరించి రెండో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించే అంశంపై చర్చించాం. తమిళనాడు ప్రభుత్వం కూడా ఆదివారం ఎస్ఓపీలు విడుదల చేసింది' అని తెలిపారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మొత్తం సామర్థ్యం 50,000 ఉండగా 25 వేల మందిని అనుమతించనున్నారు.


Click it and Unblock the Notifications
