
హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ హడావుడిని సరిగ్గా దసరా రోజునే పూర్తి చేసుకున్న భారత క్రికెటర్లు అప్పుడే జాతీయ జట్టుకు ఆడేందుకు సిద్దమయ్యారు. లీగ్లో ఆయా ఫ్రాంఛైజీల తరపున గొప్ప ప్రదర్శనతో అదరగొట్టిన మన క్రికెటర్లు.. ఇప్పుడు జాతీయ జట్టు తరపున అదే జోరు కొనసాగించేందుకు తమ అస్త్రశస్త్రాలను సరి చూసుకునే పనిలో పడ్డారు. టీ20 ప్రపంచకప్ను పట్టేయాలనే పట్టుదలతో ఉన్న కోహ్లీసేన.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పోరుకు ముందు రెండు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది. తొలి మ్యాచ్లో సోమవారం ఇంగ్లండ్తో తలపడనుంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్కు జట్టు కూర్పు ఒక్కటే సమస్యగా మారింది. మరి.. అందుకు పరిష్కారం కనుక్కునే దిశగా ఈ వార్మప్ మ్యాచ్లను జట్టు ఎంతమేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.
రోహిత్ శర్మ ఓపెనింగ్ పార్టనర్ ఎవరు? హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సంగతేంటి? అతన్ని ఏ స్థానంలో ఆడించాలి? అనే అంశాలతో పాటు సరైన బౌలింగ్ కాంబినేషన్ను ఎంచుకోవడం ప్రస్తుతం మేనేజ్మెంట్ ముందున్న సవాళ్లు. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లను సైతం అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేయనుంది. తమ అనుబంధ చానెల్స్తో పాటు ఓటీటీ ఫ్లాట్ఫామ్ డీస్నీ హాట్స్టార్లో ఈ సన్నాహక మ్యాచ్లను చూడవచ్చు. అంతర్జాతీయ మ్యాచ్ల్లానే ఈ సన్నాహక ఆటకు స్టార్ స్పోర్ట్స్ అన్ని ఏర్పాట్లు చేసింది. స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3తో పాటు స్థానిక భాషల్లోని తెలుగు, తమిళం, కన్నడ చానెళ్లో కూడా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ 2021లో రోహిత్ కాస్త తడబడినా.. రాహుల్ దుమ్ములేపాడు. పరుగుల వరద పారిస్తూ కింగ్స్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇక నాలుగో స్థానంలో హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. ఇక వికెట్ కీపర్ స్థానంలో రిషభ్ పంత్ ఆడటం ఖాయం. గాయంతో ఇబ్బందిపడుతున్న హార్దిక్ పాండ్యాకు అవకాశమిస్తారా? లేక రెస్ట్ ఇస్తారనేది చూడాలి. ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజాకు చోటు ఖాయం. స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ఆడటం ఖాయం. ఇప్పటికే మెగా టోర్నీ క్వాలిఫయర్ మ్యాచ్లు ప్రారంభమవ్వగా.. సూపర్ 12 స్టేజ్కు అక్టోబర్ 23న తెరలేవనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న జరుగుతుంది.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్/హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్