
అహ్మదాబాద్: టీమిండియా సంచలనం, లెఫ్టార్మ్ పేసర్ టీ నటరాజన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు నెట్బౌలర్గా వెళ్లి.. అనూహ్యంగా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి సత్తా చాటిన ఈ తమిళనాడు పేసర్.. విశ్రాంతి నేపథ్యంలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్కు దూరమయ్యాడు. అనంతరం టీ20 సిరీస్కు ఎంపికైన నట్టూ.. గాయం కారణంగా నాలుగు మ్యాచ్లు ఆడలేకపోయాడు.
భుజ గాయంతో బెంగళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చికిత్స తీసుకున్న నట్టూ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లను ఈ తమిళనాడు ప్లేయర్ క్లియర్ చేశాడు. యోమో టెస్ట్తో పాటు కొత్తగా తీసుకొచ్చిన 2 కిలోమీటర్ల టెస్ట్లో కూడా పాసయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐనే ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిట్నెస్ టెస్ట్లో నెగ్గిన నటరాజన్ జట్టుతో కలిసాడని వెల్లడించింది.
ఈ క్రమంలోనే గురువారం ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా డగౌట్లో నట్టూ కనిపించాడు. ఇక పూర్తి ఫిట్నెస్ సాధించిన నట్టూ ఆఖరి టీ20లో బరిలోకి దిగడం ఖాయం. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా లేక ఇబ్బంది పడుతున్న భారత జట్టుకు నట్టూ అవసరం చాలా ఉంది. భువీ జట్టులో ఉన్న స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అయితే నట్టూ జట్టులోకి వస్తే ఎవర్నీ బయటకు పంపాలనేది జట్టుకు తలనొప్పిగా మారింది.
బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయాలంటే నట్టూ జట్టులోకి రావాల్సిందే. నట్టూ కోసం ఓ బ్యాట్స్మెన్ను పక్కనపెట్టే అవకాశం కూడా ఉంది. మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించిన భువీనీ తప్పించడానికి టీమ్మేనేజ్మెంట్ సాహసం చేయకపోవచ్చు. అయితే స్పిన్నర్లు తేలిపోతుండటంతో ఓ స్పిన్నర్పై వేటు వేసే అవకాశం ఉంది. నాలుగో టీ20లో దారుణంగా విఫలమైన వాషింగ్టన్ సుందర్పై వేటు పడే అవకాశం ఉంది.
పూర్తి ఫిట్నెస్ సాధించిన నట్టూ వన్డే జట్టులోను చోటు దక్కించుకున్నాడు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్లతో కలిసి పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. ఆఖరి టీ20 అహ్మదాబాద్ వేదికగానే శనివారం జరగనుంది.