
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో అవకాశం అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. సిక్స్తో పరుగుల ఖాతాను తెరిచాడు. సెకండ్ టీ20తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఈ ముంబై క్రికెటర్కు ఆ మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అనంతరం మూడో టీ20లో రోహిత్ శర్మ జట్టులోకి రావడంతో చోటు కోల్పోయాడు. ఇక తాజా మ్యాచ్కు ఇషాన్ కిషన్ గాయపడటంతో ఎట్టకేలకు అవకాశం అందుకున్న సూర్య.. తనదైన మార్క్ షాట్తో ఆటను మొదలుపెట్టాడు.
ఈ మ్యాచ్లో మళ్లీ టాస్ ఓడిన భారత్.. బ్యాటింగ్కు దిగగా.. ఓపెనర్ రోహిత్ శర్మ(12) నిరాశపరిచాడు. ఆర్చర్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆ మరుసటి బంతినే ఫైన్ లెగ్ మీదుగా భారీ సిక్సర్ కొట్టి తన ఇన్నింగ్స్ను షురూ చేశాడు. లెగ్ స్టంప్ మీదుగా ఆర్ఛర్ వేసిన షార్టిపిచ్ బంతిని సూర్య అద్భుతంగా ఆడాడు. అతనికి షాట్కు ఆర్చర్తో పాటు కామెంటేటర్లు అవాక్కయ్యారు. సిక్స్తో మొదలుపెట్టిన సూర్య అంటూ గట్టిగా అరిచారు. అనంతరం అదే జోరులో మరో రెండు బౌండరీలు బాదిన సూర్య.. తన ఐపీఎల్ సూపర్ పెర్ఫామెన్స్ను కొనసాగిస్తున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ (13 బ్యాటింగ్) నిలకడగా ఆడుతుండటంతో భారత్ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 46 రన్స్ చేసింది.
ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగగా.. భారత్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇషాన్ కిషన్ గాయపడటంతో అతని స్థానంలోకి సూర్యకుమార్ యాదవ్ రాగా.. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో రాహుల్ చాహర్ అవకాశం దక్కించుకున్నాడు.