స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు:
తొలి ఇన్నింగ్స్ను భారత ఓపెనర్లు నెమ్మదిగా ఆరంభించారు. పిచ్ బౌలర్లకు సహరించడంతో ఆఖరి సెషన్లో ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ కట్టుదిట్టంగా లేయడంతో 27వ బంతికి శుభ్మన్ గిల్ ఫోర్ బాది పరుగుల ఖాతా తెరిచాడు. అయితే కుదురుకుంటున్న సమయంలో జోఫ్రా ఆర్చర్ వేసిన 15వ ఓవర్లో గిల్ (11) భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. జాక్ లీచ్ వేసిన తర్వాతి ఓవర్లో అప్పుడే క్రీజులోకి వచ్చిన చేటేశ్వర్ పుజారా ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. స్పిన్ బౌలింగ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసే పుజారా ఎదుర్కొన్న నాలుగో బంతికే డకౌట్ అయ్యాడు.
రోహిత్ హాఫ్ సెంచరీ:
ఈ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రోహిర్ శర్మతో ఇన్నింగ్స్ను నిర్మించాడు. ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. కోహ్లీ అతడికి చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో రోహిత్ 63 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్లో రోహిత్కిది 12వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అయితే ఇన్నింగ్స్ మరికొన్ని బంతుల్లో ముగుస్తుందనగా.. కోహ్లీ (27) ఔట్ అయ్యాడు. మరో నాలుగు బంతుల అనంతరం మొదటి రోజు పూర్తయినట్టు అంపైర్లు ప్రకటించారు. రెండో రోజు కోహ్లీసేనలో ఏ ఇద్దరు నిలిచినా మ్యాచ్ ఏకపక్షం కావడం ఖాయం.
ఆదుకున్న క్రాలీ:
అంతకు ముందు టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ను అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్ దెబ్బకొట్టారు. తొలిరోజు నుంచే స్పిన్ను అనుకూలించిన పిచ్ను ఉపయోగించుకొని ప్రత్యర్థిని ఆటాడుకున్నారు. వందో టెస్ట్ ఆడుతున్న పేసర్ ఇషాంత్ శర్మ జట్టు స్కోరు రెండు పరుగుల వద్దే ఓపెనర్ డామ్ సిబ్లే (0)ని పెవిలియన్ పంపించి శుభారంభం అందించాడు. వేగంగా ఆడుతున్న మరో ఓపెనర్ జాక్ క్రాలీ (53; 84 బంతుల్లో 10×4)కి అండగా నిలిచిన జానీ బెయిర్స్టోను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకొని రెండో వికెట్ పడగొట్టాడు. అయితే కెప్టెన్ జో రూట్ (17; 37 బంతుల్లో)తో కలిసి క్రాలీ మూడో వికెట్కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
అక్షర్ మాయ:
ఇంగ్లీష్ ఆటగాళ్లు నిలదొక్కుకుంటున్న సమయంలో ఆర్ అశ్విన్ తెలివైన ఎత్తుగడతో జో రూట్ను పెవిలియన్కు పంపించాడు. ఫుల్లర్ లెంగ్త్ బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. రూట్ సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. మరికాసేపటికే క్రాలీని అక్షర్ బోల్తా కొట్టించడంతో ఇంగ్లండ్ 81/4తో భోజన విరామానికి వెళ్లింది. ఆ తర్వాత అక్షర్ మాయ చేశాడు. భిన్నమైన బంతులు విసురుతూ ఇంగ్లండ్ ఆటగాళ్లను దెబ్బతీశాడు. స్టోక్స్ (6), ఫోక్స్ (12), ఆర్చర్ (11), బ్రాడ్ (3)ను పెవిలియన్కు పంపించాడు. పోప్ (1), లీచ్ (3)ను అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో రూట్ సేన 112కు ఆలౌట్ అయింది.