
అహ్మదాబాద్: భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇక తమ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుందని, టామ్ కరన్ స్థానంలో మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.
తాము టాస్ గెలిస్తే ఫీల్డింగే తీసుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కానీ ఈ సవాల్ను స్వీకరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపాడు. ప్రపంచకప్ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం తమకు ఎంతో ముఖ్యమని, ధాటిగా ఆడి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతామని ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని, రోహిత్ శర్మ జట్టులోకి రాగా.. సూర్యకుమార్ యాదవ్కు ఉద్వాసన తప్పలేదన్నాడు.
ఇక రోహిత్తో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనుండగా.. ఇషాన్ కిషాన్ మూడో స్థానంలో బరిలోకి దిగుతాడని చెప్పాడు. ఇక గత మ్యాచ్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సూర్య.. తానెంటో నిరూపించుకోకముందే చోటు కోల్పోయాడు.
టెస్టు సిరీస్ తరహాలోనే టీ20ల్లోనూ ఇంగ్లండ్ చేతిలో తొలి మ్యాచ్లో ఓడిన భారత జట్టు వెంటనే కోలుకొని సత్తా చాటింది. రెండో పోరులో సునాయాస విజయం సాధించిన టీమిండియా ఇదే జోరును కొనసాగించి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ అనుభవంతో ఇంగ్లండ్ మళ్లీ తమ బ్యాటింగ్కు పదును పెట్టే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మరోసారి టాప్-2 జట్ల మధ్య పొట్టి సమరం ఆసక్తికరంగా సాగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్న స్థితిలో ఈ మ్యాచ్లో గెలిచే జట్టు సిరీస్లో ముందంజ వేసే అవకాశం ఉంటుంది. రెండో మ్యాచ్లో విజయం తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిన కోహ్లి సేన అన్ని రంగాల్లో రాణించి ప్రత్యర్థిని మళ్లీ పడగొట్టాలని భావిస్తోంది.
తుది జట్లు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ యాదవ్, యుజ్వేంద్ర చహల్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్స్టో, స్టోక్స్, స్యామ్ కరన్, ఆర్చర్, రషీద్, వుడ్, జోర్డాన్.