
అహ్మదాబాద్: క్రికెట్ మైండ్ గేమ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో పరిస్థితులకు తగ్గట్లు ఎప్పటికప్పుడూ వ్యూహాలు రచిస్తూనే ఉండాలి. అయితే భారత్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా గురవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్లో కూడా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని సూటిపోటీ మాటలతో రెచ్చగొట్టిన రిషభ్ పంత్ అతను వికెట్ పారేసుకునేలా చేశాడు.
మొతెరా మైదానం వేదికగానే జరిగిన డే/నైట్ టెస్ట్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ అంతా విఫలమైనా.. జాక్ క్రాలీ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలోనే తాజా మ్యాచ్లో కూడా జాక్ క్రాలీ పర్వాలేదనిపిస్తాడని అంతా భావించారు. కానీ అతను దారుణంగా విఫలమై తీవ్రంగా నిరాశపరిచాడు. జాక్ క్రాలీ వికెట్ పారేసుకోవడంలో రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ అక్షర్ పటేల్ వేసిన 8వ ఓవర్ నాలుగో బంతి తర్వాత జాక్ క్రాలీని ఉద్దేశించి పంత్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. 'క్రాలీకి కొపమొచ్చింది'అంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన క్రాలీ ఆ మరుసటి బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి సరిగ్గా బ్యాట్కు కనెక్ట్ కాకపోవడంతో నేరుగా సిరాజ్ చేతిలో పడింది. దాంతో క్రాలీ(30 బంతుల్లో 1 ఫోర్తో 9) నిరాశగా వెనుదిరిగాడు. పంత్ వ్యాఖ్యలు స్టంప్ మైక్లో రికార్డవ్వడంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దాంతో.. 7.5 ఓవర్లు ముగిసే సమయానికే ఇంగ్లండ్ 15/2తో ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జోరూట్(5)ను సిరాజ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించడంతో ఇంగ్లండ్ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లపైకి ఎదురు దాడికి దిగి బౌండరీలు రాబట్టాడు. దాంతో ఇంగ్లండ్ 74/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీని లంచ్ బ్రేక్ అనంతరం సిరాజ్ విడదీశాడు. బెయిర్ స్టోను వికెట్ల ముందు బోల్తాకొట్టించి పెవిలియన్ చేర్చడంతో నాలుగో వికెట్కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్(38), ఓలిపోప్(5) ఉండగా.. 38.3 ఓవర్లలో ఇంగ్లండ్ 95/4 పరుగులు చేసింది.