
ముంబై: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు సమయం దగ్గరపడుతున్న వేళ టీమిండియాలో కరోనా కలకలం రేగింది. యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్తో పాటు త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీ కరోనా పాజిటీవ్గా తేలారు. దాంతో వీరిద్దరిని ఐసోలేషన్లో ఉంచారు. అయితే దయానంద్కు సన్నిహితంగా ఉన్న మరో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, బ్యాట్స్మన్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ను కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్లో ఉంచారు.
ఈ ముగ్గురు కరోనా నెగటివ్గా తేలినప్పటికీ యూకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసోలేషన్కు పంపారు. దాంతో టీమిండియాకు చెందిన ఐదుగురు సభ్యులు ప్రస్తుతం లండన్లో ఐసోలేషన్లో ఉన్నారు. ఇక 20 రోజుల విశ్రాంతిని పూర్తి చేసుకున్న మిగతా జట్టు సభ్యులు డర్హమ్ బయలుదేరారు.
అయితే టీమిండియా ఆటగాళ్లకు 20 రోజుల విశ్రాంతి ఇవ్వడంతోనే కరోనా బారిన పడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిక్కిరిసిన అభిమానుల మధ్య యూరో కప్ మ్యాచ్లను చూసేందుకు వెళ్లినందుకే పంత్కు వైరస్ సోకి ఉండవచ్చని, అతను మాస్క్ కూడా ధరించలేదని కొందరు విమర్శించారు.
కానీ రిషభ్ పంత్ లండన్లోని ఓ దంత వైద్యుడిని సంప్రదించాడని, అక్కడే వైరస్ సోకి ఉండవచ్చని టీమ్ వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. 'జూలై 5, 6 తేదీల్లో రిషభ్ పంత్ లండన్లోని ఓ దంత వైద్యుడిని సంప్రదించాడు. అక్కడే అతనికి వైరస్ అటాక్ అయ్యి ఉండొవచ్చు.'అని టీమ్కు చెందిన ఓ అధికారి తెలిపాడు.
ఇక రిషభ్ పంత్కు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అండగా నిలిచారు. నిజ జీవితంలో పూర్తిగా మాస్కులు ధరించడం కష్టమని పంత్పై వస్తున్న విమర్శలను దాదా తిప్పికొట్టాడు. 'ఇంగ్లండ్లో యూరో చాంపియన్షిప్, వింబుల్డన్ జరగడం మనం చూశాం. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తుండటంతో నిబంధనలు మారాయి.
అప్పుడు ఆటగాళ్లు విరామంలో ఉన్నారు. అయినా రోజంతా మాస్క్లు ధరించడం భౌతికంగా అసాధ్యం. పంత్ గురించి మేం దిగులు చెందడం లేదు. అతని ఆరోగ్యం మెరుగవుతోంది. రెండు టెస్టుల్లో నెగెటివ్ రాగానే జట్టుతో కలుస్తాడు' అని గంగూలీ ఓ జాతీయ మీడియాకు తెలిపారు.