
ఒకే ఒక్కడు..
అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ బ్యాట్స్మన్ బెన్ స్టోక్స్ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో 200 మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లను ఔట్ చేసిన తొలి క్రికెటర్గా ఈ భారత సీనియర్ స్పిన్నర్ రికార్డు సృష్టించాడు. ఇందులో డేవిడ్ వార్నర్ను 10 సార్లు, అలిస్టర్ కుక్, స్టోక్స్ను 9 సార్లు, జేమ్స్ అండర్సన్, ఎడ్ కొవాన్లను 7 సార్లు చొప్పున ఔట్ చేశాడు. ఇక అశ్విన్ తర్వాత ముత్తయ్య మురళీ దరన్(191), జేమ్స్ అండర్సన్(191) మంది లెఫ్టార్మ్ బ్యాట్స్మెన్ను ఔట్ చేశారు.

హర్భజన్ రికార్డు బ్రేక్..
స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా కూడా అశ్విన్ రికార్డు కెక్కాడు. ఇప్పటి వరకు హర్భజన్ పేరిట ఉన్న ఈ రికార్డును తాజా మ్యాచ్తో యాష్ అధిగమించాడు. స్వదేశంలో 55 మ్యాచ్లు ఆడిన హర్భజన్ సింగ్ 265 వికెట్లు తీయగా.. 45 టెస్టుల్లోనే అశ్విన్ 268 వికెట్లు తీశాడు. ఇందులో 23 సార్లు 5 వికెట్ల చొప్పున, 6 సార్లు పది వికెట్ల చొప్పున సాధించాడు. టీమిండియా నుంచి తొలి స్థానంలో లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఉన్నాడు. కుంబ్లే 62 టెస్టుల్లో 350 వికెట్లు తీశాడు. ఇందులో 25 సార్లు 5 వికెట్ల ఫీట్, 7 సార్లు 10 వికెట్ల ఫీట్ను అందుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే అశ్విన్ ఇప్పటివరకు టీమిండియా తరపున 77 టెస్టుల్లో 396 వికెట్లు, 111 వన్డేల్లో 150 వికెట్లు, 46 టీ20ల్లో 52 వికెట్లు తీశాడు.
మెక్గ్రాత్తో సమంగా..
కెరీర్లో 29వ ఫిఫర్ సాధించిన అశ్విన్.. అత్యధిక ఫిఫర్స్ సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లేన్ మెక్గ్రాత్ సమంగా ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మురళీ దరణ్ 67 ఫిఫర్లతో అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్(37), హాడ్లీ(36), కుంబ్లే(35), హెరాత్(34), అండర్సన్(30) అశ్విన్ కన్నా ముందున్నారు. మెక్గ్రాత్ 124 మ్యాచ్ల్లో 29 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఐసీసీ కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది.

పట్టు బిగించిన భారత్..
తొలి రోజు బ్యాట్తో చెలరేగిన టీమిండియా.. రెండో రోజు బంతితో విజృంభించి మ్యాచ్పై పట్టు బిగించింది. రవిచంద్రన్ అశ్విన్ (5/43) మాయాజాలానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులకే కుప్పకూలింది. బెన్ ఫోక్స్ (42 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం 195 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆదివారం ఆట ముగిసే సమయానికి 54/1తో నిలిచింది. ప్రస్తుతం 249 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో రోహిత్ శర్మ (25 బ్యాటింగ్) పుజారా (7బ్యాటింగ్) ఉన్నారు.


Click it and Unblock the Notifications
