
అహ్మదాబాద్: టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రి మంగళవారం కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నాడు. దానికి సంబంధించిన ఫొటోను ట్విటర్ వేదికగా షేర్ చేసిన ఈ మాజీ క్రికెటర్ సంతోషం వ్యక్తం చేశాడు. మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ను శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. 'ఇప్పుడే కొవిడ్-19 వాక్సిన్ చేయించుకున్నా. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దిన శాస్త్రవేత్తలు, మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు. అలాగే ఈ వాక్సినేషన్ ప్రక్రియను ఎంతో నిబద్ధతతో.. సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రి వైద్య బృందానికి అభినందనలు' అని శాస్త్రి ట్వీట్ చేశాడు.
అయితే రవిశాస్త్రి ట్వీట్పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత 45 రోజులు వరకు మద్యం ముట్టవద్దని ఒకరంటే.. ఏ కేటగిరీలో రవిశాస్త్రి వ్యాక్సినేషన్ తీసుకున్నాడని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. 'నీకేందుకుయ్యా వ్యాక్సిన్ 24 గంటలు మత్తులునే ఉంటావ్.. నీ బాడీకి పనిచేస్తుందా?'ఇంకొకరు సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వాక్సిన్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ సైతం నిన్ననే ఢిల్లీలోని ఎయిమ్స్లో వాక్సినేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు టీకా వేసుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపారు. నిన్న ఒక్కరోజు రాత్రి వరకు సుమారు 29 లక్షల మంది వాక్సినేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్తో నాలుగు టెస్ట్ల సిరీస్లో భాగంగా అహ్మదాబాద్లో ఉన్న రవిశాస్త్రి అక్కడే వ్యాక్సిన్ ఇప్పించుకున్నాడు. ఈ సిరీస్ ఇప్పటికే మూడు టెస్ట్లు ముగియగా.. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ వేదికగానే గురువారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్లో గెలిచినా, డ్రా చేసుకున్నా భారత్ సిరీస్తో పాటు వరల్ట్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్కు చేరుతుంది. అలా కాకుండా ఓడితే మాత్రం ఫైనల్ బెర్త్ ఆసీస్కు దక్కుతుంది. మరి భారత్ ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ టెస్ట్కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను భారత్ కోల్పోయింది. వర్క్ లోడ్ నేపథ్యంలో అతను విశ్రాంతి తీసుకున్నాడు.