
చెన్నై: భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ లంచ్ బ్రేక్ సమయానికి 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మ ధాటికి ఖతా తెరవకుండానే ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(16)ని అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ వేసిన 8 ఓవర్ రెండో బంతి సిబ్లీ బ్యాట్ను తాకుతూ షార్ట్ లెగ్లో ఉన్న విరాట్ కోహ్లీ చేతిలో పడగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో భారత్ రివ్యూతో ఫలితం రాబట్టింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్, ఫస్ట్ టెస్ట్ హీరో జోరూట్ను అరంగేట్ర ఆటగాడు అక్షర్ ఔట్ చేశాడు.
సూపర్ బౌలింగ్తో ఈ ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ను బోల్తా కొట్టించాడు. స్వీప్ షాట్లు అలవోకగా ఆడే జోరూట్ను ఆ ఉచ్చులోనే బిగించాడు. 10 ఓవర్లో అతను వేసిన డ్రై లెంగ్త్ బాల్ను స్వీప్ షాట్ ఆడిన జోరూట్(6).. షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న అశ్విన్కు చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్, డాన్ లారెన్స్ నిదానంగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే అశ్విన్ తన వ్యూహంతో డాన్ లారెన్స్ను పెవిలియన్కు చేర్చాడు.
సరిగ్గా లంచ్ బ్రేక్కు ముందు బంతిని అందుకున్న అశ్విన్.. ఆ ఓవర్ చివరి బంతి వేసే ముందు ఆకస్మాత్తుగా ఆగిపోయాడు. లంచ్కు మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేశాడు. దాంతో చికాకుకు గురైన లారెన్స్.. అశ్విన్ వేసిన చివరి బంతిని డిఫెన్స్ చేయబోయి షార్ట్ లెగ్లో ఉన్న కోహ్లీకి చిక్కాడు. దాంతో ఇంగ్లండ్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో స్టోక్స్(8 నాటౌట్) ఉన్నాడు.
అంతకు ముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 329 పరుగులుకు ఆలౌటైంది.ఓ వైపు డాషింగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(77 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 58 నాటౌట్) ధాటిగా ఆడినా.. మరోవైపు ఓలిస్టోన్(3/47) దెబ్బకు టెయిలండర్లు నిలబడలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ(4/128) నాలుగు వికెట్లు తీయగా.. ఓలీ స్టోన్ మూడు, జాక్ లీచ్(2/78) రెండు వికెట్లు తీశారు. జోరూట్కు ఓ వికెట్ దక్కింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లు ఒక్క ఎక్స్ట్రా కూడా ఇవ్వలేదు. కాగా భారత ఇన్నింగ్స్లో ఐదుగురు డకౌటయ్యారు.