
తుది జట్టుపై ఉత్కంఠ:
మూడు వన్డేల ఈ సిరీస్ కోసం ఇప్పటికే 18 మందితో కూడిన భారత్ జట్టుని బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తొలిసారి వన్డే జట్టులోకి వచ్చారు. తొలి వన్డేకి భారత్ తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. స్టార్ ఆటగాళ్లు, రిజర్వ్ బెంచ్ బలంగా ఉండడంతో తుది జట్టులో ఎవరుంటారనేది కచ్చితంగా చెప్పని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకూడదని భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. దాంతో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది.

బెంచ్కే రాహుల్, సూర్య:
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డేల్లో ఉండడంతో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం లేదు. టీ20ల్లో రాహుల్ పేలవ ప్రదర్శన కారణంగా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లను ఆడించే సూచనలు ఉన్నాయి. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగులో శ్రేయాస్ అయ్యర్ ఆడనున్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్కి రానున్నాడు. ఆరులో హార్దిక్ పాండ్యా వస్తాడు. దీంతో టీ20ల్లో అదరగొట్టిన సూర్యకుమార్కు అవకాశమే లేకుండా పోయింది. ఒకవేళ సూర్య ఆడాలంటే కచ్చితంగా అయ్యర్ను పక్కనపెట్టాల్సిందే. కోహ్లీ ఈ సాహసం చేయకపోవచ్చు.

చహల్కి జోడీగా కృనాల్:
భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, శార్ధూల్ ఠాకూర్ రూపంలో ముగ్గురు పేసర్లు తుది జట్టులో ఆడనున్నారు. శార్ధూల్ బ్యాటింగ్ చేయడం అతనికి అదనపు బలం. హార్దిక్ పాండ్యా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడు. ఇక స్పిన్నర్ల కోటాలో యుజ్వేంద్ర చహల్కి జోడీగా కృనాల్ పాండ్యాను తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతడి సొంతం. దీంతో ప్రసిద్ధ్ కృష్ణ కూడా బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది.

తొలి వన్డేకి భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేందర్ చహల్, టీ నటరాజన్.
రవిచంద్రన్ అశ్విన్ను ప్రశంసించిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్.. ఎందుకో తెలుసా?


Click it and Unblock the Notifications
