
లండన్: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు అలగ్జాండ్రా హార్ట్లే ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల క్రికెట్ మ్యాచ్పై తాజాగా అశ్విన్ చేసిన ట్వీటే అందుకు కారణం. ఆదివారం చివరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టుపై దక్షిణాఫ్రికా మహిళల జట్టు విజయం సాధించింది. ప్రొటీస్ మిడిలార్డర్ బ్యాటర్ లౌరా వోల్వార్ట్ (39 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో జట్టును గెలిపించారు.
అద్భుతంగా ఆడి దక్షిణాఫ్రికా జట్టును గెలిపించిన లౌరాను ప్రశంసిస్తూ ఆర్ అశ్విన్ ట్వీట్ చేశాడు. 'లౌరాను ఎలా ఔట్ చేయాలి?. అమెకు సాఫ్ట్ సిగ్నల్ పంపించాలా?' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు అలగ్జాండ్రా హార్ట్లే స్పందించారు. 'ఇదే మేం చూడాలనుకుంటున్నాం. అన్నింటికంటే ఇదే ముఖ్యమైనది. మహిళల ఆటపై నిజమైన ఆసక్తి కనబర్చిన అశ్విన్కు ధన్యవాదాలు. మిగతావారు కూడా ఇదే అనుసరించండి' అని అలగ్జాండ్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భరత్ 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (7) త్వరగానే నిష్క్రమించినా.. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (47), హర్లీన్ డియోల్ (31) జట్టును ఆదుకున్నారు. అయితే 87/1తో ఉన్న స్థితి నుంచి 94/3తో భారత్ తడబడినా.. రిచా ఘోష్ (44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మెరుగైన స్కోరు అందించింది.
ఛేదనలో ఓపెనర్ లిజలీ (70) ధాటిగా ఆడడంతో దక్షిణాఫ్రికా విజయం దిశగా పయనించింది. లౌరా భారత జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరి ఓవర్లో సఫారీ జట్టు 9 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే తొలి నాలుగు బంతులకు పేసర్ అరుంధతి రెడ్డి.. మూడే పరుగులు ఇవ్వడంతో సమీకరణం 2 బంతుల్లో 6 పరుగులుగా మారింది. కానీ ఐదో బంతిని అరుంధతి నోబాల్గా వేయడమే కాక రెండు పరుగులు ఇవ్వడంతో దక్షిణాఫ్రికాకు విజయం తేలికైపోయింది. ఐదవ బంతికి రెండు పరుగులు చేసిన లౌరా.. చివరి బంతికి సింగిల్ తీసి జట్టుకు విజయాన్ని అందించింది. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.