పొలం దున్నినట్లే..
తాజాగా వాన్ మొతేరా పిచ్పై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించాడు. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ రైతు తన ఎద్దుల సాయంతో పొలం దున్నుతున్న ఫొటోను షేర్ చేశాడు. దానికి నాలుగు టెస్ట్ కోసం క్యూరేటర్ మొతేరా పిచ్ను ఎలా సిద్దం చేస్తున్నాడో చూడండి అంటూ క్యాప్షన్గా పేర్కొన్నాడు.'మొతేరా పిచ్ను క్యురేటర్ కూడా ఇలానే సిద్ధం చేస్తున్నాడు. ఈసారి మాత్రం 5 రోజులు మ్యాచ్ జరిగేలా ప్రయత్నిస్తున్నట్లున్నాడు. ఈ ఐదు రోజులు కూడా పిచ్ స్పిన్కు అనుకూలించేలా సిద్దం చేస్తున్న అతన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నా'అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైలర్ అయింది.
ఫైనల్ బెర్త్..
రెండు రోజుల్లోనే ముగిసిన ఈ డే/నైట్ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అంతేకాకుండా ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు మరింత చేరువైంది. మార్చి 4 నుంచి మొతెరా మైదానం వేదికగానే జరగనున్న ఆఖరి టెస్టులో కనీసం డ్రా చేసుకున్నా భారత్ ఫైనల్లో అడుగుపెడుతుంది. అలా కాకుండా ఓడితే మాత్రం ఆస్ట్రేలియా ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది.
బ్యాటింగ్ పిచ్..
ఇక వాన్ అన్నట్లు ఆఖరి మ్యాచ్ కోసం ఐదు రోజులు ఆట కొనసాగేలా పిచ్ను బీసీసీఐ రూపొందిస్తుంది. మరోసారి పూర్తిగా స్పిన్కు అనుకూలించే వికెట్ను వాడితే ఐసీసీ నుంచి కఠిన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో చివరి టెస్ట్ కోసం బ్యాటింగ్ పిచ్ను సిద్ధం చేయాలని భావిస్తోంది. 'పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. బౌన్స్ కూడా లభిస్తుంది. ఒకే వేదికగా రెండు మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఒక టెస్టు ఫలితంతో నిర్ణయానికి రావద్దు. ఆఖరి టెస్టు ముగిసిన అనంతరం మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్ ఇచ్చిన రిపోర్ట్తో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఐసీసీ నిర్ణయిస్తుంది. పిచ్పై ఇప్పటివరకు ఇంగ్లండ్ జట్టు ఎలాంటి ఫిర్యాదు కూడా ఇవ్వలేదు'అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.