
చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫుల్ జోష్లో కనిపించాడు. అభిమానుల సమక్షంలో ఈ మ్యాచ్ జరుగుతుండటం.. భారత బౌలర్లు సత్తా చాటడంతో కోహ్లీ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కరోనా పుణ్యమా గత ఏడాదిగా ప్రేక్షకుల మద్దతుకు దూరమైన కోహ్లీకి.. ఈ మ్యాచ్కు ఫ్యాన్స్ రావడంతో ఎక్కడలేని ఊపొచ్చింది. రెండో రోజు మొత్తం కోహ్లీ అదే జోష్లో కనిపించాడు. ఓ వైపు ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూనే.. మరోవైపు తన సైగలు, చేష్టలతో ఫ్యాన్స్ను ఉర్రూతలుగించాడు.
ఇక తొలి రోజు బ్యాట్తో చెలరేగిన టీమిండియా.. రెండో రోజు బంతితో విజృంభించి మ్యాచ్పై పట్టు బిగించింది. రవిచంద్రన్ అశ్విన్ (5/43) మాయాజాలానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులకే కుప్పకూలింది. బెన్ ఫోక్స్ (42 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం 195 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆదివారం ఆట ముగిసే సమయానికి 54/1తో నిలిచింది. ప్రస్తుతం 249 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో రోహిత్ శర్మ (25 బ్యాటింగ్) పుజారా (7బ్యాటింగ్) ఉన్నారు.