
చెన్నై: గాయం నుంచి కోలుకొని మళ్లీ భారత జట్టుతో కలవడం చాలా సంతోషంగా ఉందని స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ అన్నాడు. దీనికి మించిన ఆనందం మరొకటి ఉండదని ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనకు ఎంపికైన రాహుల్.. నాలుగు టెస్ట్ల సిరీస్లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే అర్థాంతరంగా వెనుదిరగాడు. జట్టు బ్యాలెన్స్ వల్ల తొలి రెండు మ్యాచ్లు అవకాశం రాకపోగా.. మూడో టెస్ట్లో చోటు ఖాయమనే తరుణంలో ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. అతని ఎడమ చేతి మణికట్టుకు తీవ్ర గాయమైంది. దాంతో వెంటనే బెంగళూరు చేరుకొని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు.
అక్కడ పూర్తిగా కోలుకొని తిరిగి ఫిట్నెస్ సాధించిన రాహుల్ ఇంగ్లండ్తో చెన్నై వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఫస్ట్ టెస్ట్ కోసం ఆతృతగా ఉన్నానని మంగళవారం ట్వీట్ చేశాడు. 'పునరావాస కేంద్రంలో పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడం సంతోషంగా ఉంది. గాయం నుంచి కోలుకోవడానికి మించిన గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. సహచర ఆటగాళ్లతో కలవడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. అలాగే టీమిండియా తరఫున ఆడడం గర్వంగా భావిస్తా. ఇక రాబోయే రోజుల్లో ఇంగ్లండ్తో తలపడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని రాహుల్ పేర్కొన్నాడు. దీనికి విమానం ఎక్కుతున్న ఫొటో జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఆస్ట్రేలియా పర్యటనలో దక్కిన చారిత్రాత్మక విజయంతో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా.. శ్రీలంకను సొంతగడ్డపై చిత్తు చేసిన జోరులో ఇంగ్లండ్ ఉంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకం. ఇంగ్లండ్ను 2-0, 3-0,3-1, 4-0తో చిత్తు చేస్తేనే భారత్కు ఫైనల్ బెర్త్ ఉంటుంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడితే డబ్ల్యూటీసీలో భారత కథ ముగిసినట్లే.