
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న డై/నైట్ టెస్ట్లో భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. 99/3 ఓవర్నైట్ స్కోర్తో గురువారం రెండో రోజు ఆటను కొనసాగించిన కోహ్లీసేన వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే(25 బంతుల్లో 7), రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66), వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(8 బంతుల్లో 1), సుందర్(0), అక్షర్ పటేల్(0) వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. 11 పరుగుల వ్యవధిలోనే భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది.
రహానే, రోహిత్లను తన వరుస ఓవర్లలో జాక్ లీచ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్(0), అక్షర్ పటేల్లను ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ వెనక్కి పంపాడు. రోహిత్ శర్మ రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. జాక్ లీచ్ వేసిన 41 ఓవర్ తొలి బంతిని స్వీప్ షాట్ ఆడబోయిన రోహిత్ అంచనా తప్పింది. దాంతో బంతి బ్యాట్ను మిస్సై శరీరానికి తాకింది. ఎల్బీ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. రోహిత్ సమీక్షకు వెళ్లగా అంపైర్స్ కాల్గా తేలింది. దాంతో హిట్ మ్యాన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత్ టప టపా వికెట్లు కోల్పోయింది. జోరూట్ బౌలింగ్లో పంత్ కీపర్ క్యాచ్గా.. వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ గోల్డెన్ డక్గా పెవిలియన్ బాట పట్టాడు.
దాంతో భారత్ 126 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్(6 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ(0 బ్యాటింగ్) ఉన్నారు. 45 ఓవర్లలో భారత్ 125/8 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఆతిథ్య జట్టు 13 రన్స్ లీడ్లో ఉంది.