
అహ్మదాబాద్: భారత్తో మూడు వన్డేల సిరీస్ ముంగిట ఇంగ్లండ్ జట్టుకు గట్టిషాక్ తగిలింది. ఇప్పటికే టెస్ట్, టీ20 సిరీస్ కోల్పోయిన ఆ జట్టు.. వన్డే సిరీస్కు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయింది. మోచేతి గాయం కారణంగా అతను వన్డే సిరీస్కు దూరమవుతున్నాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మోచేతి గాయం చికిత్స కోసం ఆర్చర్ ఇంగ్లండ్ తిరుగుపయనమయ్యాడని, ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభ మ్యాచ్లకు కూడా దూరమవుతాడని తెలిపింది. ఆర్చర్తో పాటు జోరూట్ కూడా వన్డే సిరీస్కు దూరమవుతాడని పేర్కొంది. ఆటగాళ్ల రొటేషన్ పాలసీలో భాగంగా జోరూట్కు మూడు వన్డేల సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించినట్లు తెలిపింది.
భారత్తో శనివారం ముగిసిన ఐదు టీ20ల సిరీస్లో జోఫ్రా ఆర్చర్ అంచనాలకి మించి రాణించాడు. నాలుగో టీ20లో 4 ఓవర్లు వేసి (4/33)తో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసిన జోప్రా ఆర్చర్ని శనివారం రాత్రి ఐదో టీ20లో మోచేతి గాయం బాగా ఇబ్బందిపెట్టినట్లు తెలుస్తోంది. ఫాస్ట్ బౌలర్.. అదీ మోచేతి గాయం కావడంతో నొప్పిని తట్టుకునేందుకు ఫెయిన్ కిల్లర్లను వేసుకున్నట్లు సమాచారం. దాంతో.. వన్డే సిరీస్లోనూ అతన్ని జట్టులో కొనసాగించడం కష్టమని మోర్గాన్ పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
'వన్డేల్లో జోప్రా ఆర్చర్ ఆడటంపై ఇప్పుడే ఏం చెప్పలేని పరిస్థితి. అతను ఆడటంపై సోమవారానికి ఓ క్లారిటీ వస్తుంది. ఆర్చర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల ఆ మోచేతి గాయం అతన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. కాబట్టి.. ఇప్పుడు శ్రద్ధ అవసరం'అని ఇయాన్ మోర్గాన్ వెల్లడించాడు. అంతలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన ఆర్చర్ గైర్హాజరీపై క్లారిటీ ఇచ్చింది. పుణే వేదికగా మంగళవారం(మార్చి 23) నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు జరగనున్నాయి. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న జోప్రా ఆర్చర్.. గత సీజన్కుగానూ మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ వన్డే టీమ్..
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మోయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, టామ్ కర్రన్, లియమ్ లివింగ్ స్టోన్, మాట్ పర్కిన్సన్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, మార్క్ వుడ్