
చెన్నై: ఫస్ట్ టెస్ట్లో సూపర్ బౌలింగ్తో భారత్ పతనాన్ని శాసించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ సెకండ్ టెస్ట్కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ రొటేషన్ పాలసీలో భాగంగా అండర్సన్కు టీమిండియాతో ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న రెండో టెస్టుకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు ఈసీబీ తెలిపింది. అతని స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ జట్టులోకి వస్తాడని పేర్కొంది. ఆటగాడు ఎంత మంచి ఫామ్లో ఉన్నా.. మ్యాచ్ విన్నర్ అయినా సరే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రొటేషన్ పాలసీని కచ్చితంగా అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ టెస్ట్కు టీమిండియాపై మంచి రికార్డున్న జానీ బెయిర్స్టోను పక్కటన పెట్టిన విషయం తెలిసిందే.
అయితే సెకండ్ టెస్ట్ బ్రేక్కు అండర్సన్ అంగీకరించాడు. 'బ్యాట్స్మెన్ ఎలా అయితే రిథమ్ అందుకొని ఫామ్లోకి వచ్చాకా.. దాన్ని అలానే కొనసాగించాలనుకుంటారో.. బౌలర్లు కూడా అలానే భావిస్తారు. కానీ బ్యాక్ టు బ్యాక్ ఉన్న నాలుగు టెస్ట్ల వర్క్ లోడ్పై నాకు అవగాహన ఉంది. విశ్రాంతి విషయంలో నాకెలాంటి అభ్యంతరం లేదు'అని అండర్సన్ స్పష్టం చేశాడు. ఫస్ట్ టెస్ట్ భారత సెకండ్ ఇన్నింగ్స్లో అండర్సన్ ఒకే ఓవర్లో జోరు మీదున్న శుభ్మన్ గిల్, అజింక్యా రహానేలను ఇన్ స్వింగర్స్తో క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్కు చేర్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పంత్ను ఔట్ చేసి భారత్ ఓటమిని ఖాయం చేశాడు.

ఇక అండర్సన్ విశ్రాంతి విషయంపై ఇంగ్లండ్ హెడ్కోచ్ క్రిస్ సిల్వర్ ఉడ్ సైతం స్పందించాడు. 'అండర్సన్ను పక్కనబెట్టడం మాకు ఇష్టం లేదు. ఫస్ట్ టెస్టులో విజయం సాధించిన జట్టునే కొనసాగించాలని మాకు ఉంది. కానీ రొటేషన్ పద్దతిలో ఆటగాళ్ల ఎంపిక ఉండడంతో ఈ విషయంలో ఏం చేయలేం. అండర్సన్ స్థానంలో రానున్న బ్రాడ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. బ్రాడ్తో పాటు మంచి నాణ్యమైన బౌలర్లు ఉండడం మాకు కలిసొచ్చే అంశం. రొటేషన్ పద్దతిలో ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడం వల్ల తర్వాతి మ్యాచ్కు ఉత్సాహంగా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది.'అని తెలిపాడు.
ఇక రొటేషన్ పాలసీలో భాగంగా బ్యాట్స్మెన్ జోస్ బట్లర్ కూడా రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అతని స్థానంలో జానీ బెయిర్ స్టో లేదా ఫోక్స్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండో టెస్ట్ అభిమానుల సమక్షంలో జరగనుంది. ఇప్పటికే మ్యాచ్కు సంబంధించి టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. సుమారు 15వేల మంది అభిమానుల సమక్షంలో ఈ మ్యాచ్ జరగనుంది.