చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓ వైపు డాషింగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(77 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 58 నాటౌట్) ధాటిగా ఆడినా.. మరోవైపు ఓలిస్టోన్(3/47) దెబ్బకు టెయిలండర్లు నిలబడలేకపోయారు. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 329 పరుగులుకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ(4/128) నాలుగు వికెట్లు తీయగా.. ఓలీ స్టోన్ మూడు, జాక్ లీచ్(2/78) రెండు వికెట్లు తీశారు. జోరూట్కు ఓ వికెట్ దక్కింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లు ఒక్క ఎక్స్ట్రా కూడా ఇవ్వలేదు. కాగా భారత ఇన్నింగ్స్లో ఐదుగురు డకౌట్లయ్యారు.
300/6 ఓవర్నైట్ స్కోర్తో భారత్ రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 7.5 ఓవర్లలో మరో 29 పరుగులు జోడించి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ అక్సర్ పటేల్(5) మొయిన్ అలీ బౌలింగ్లో స్టంపౌటవ్వగా.. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఇషాంత్ శర్మ(0) బంతి వ్యవధిలోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకునే ప్రయత్నం చేసిన పంత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బంతిని అందుకున్న స్టోన్.. ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్(0), మహ్మద్ సిరాజ్(0)లను కీపర్ క్యాచ్లుగా పెవిలియన్ చేర్చడం భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఖాతా తెరవకుండా ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రోరీ బర్న్స్(0) వికెట్లు ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. క్రీజులోకి డాన్ లారెన్స్ రాగా.. ఇంగ్లండ్ ఇంకా ఖాతా తెరవలేదు.