
అహ్మదాబాద్: తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అద్భుత విజయాన్నందుకుంది. మొతేరా మైదానం వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20లో కోహ్లీసేన 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై గెలుపొందింది. ఈ ఫలితంతో ఐదు టీ20ల సమరంలో ఇరుజట్లు ఇప్పుడు 1-1తో సమంగా నిలిచాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57) సూపర్ ఫిఫ్టీతో చెలరేగగా.. రిషభ్ పంత్(23 బంతుల్లో 4 ఫోర్లతో 30), శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 37)ధనాధన్ ఇన్నింగ్స్తో రాణించారు. బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, సామ్ కరన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులకే పరిమితమైంది. బెన్ స్టోక్స్(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 46), జాసన్ రాయ్(27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 40) రాణించినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (3/42) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా (2/16), రాహుల్ చాహర్ (2/35) రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. భువనేశ్వర్ కుమార్(1/30) ఒక వికెట్ దక్కగా.. వాషింగ్టన్ సుంధర్(0/52) దారుణంగా విఫలమయ్యాడు. తన కెరీర్లోనే చెత్త గణంకాలు నమోదు చేశాడు.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ సూపర్ బౌలింగ్తో భారత్ విజయాన్నందుకుంది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. ఆర్చర్ 4, 6కి తోడు ఠాకూర్ వైడ్స్ టెన్షన్ పెట్టాయి. అయితే చివరి మూడు బంతులను కట్టడిగా బౌలింగ్ చేయడంతో భారత్ గెలుపు లాంఛనమైంది.