
రోహిత్కు జతగా రాహుల్..
సీనియర్లు ఫామ్లో ఉంటే... కుర్రాళ్లేమో జోరు మీదున్నారు. దీంతో భారత తుది జట్టు కసరత్తు టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. అందుకేనేమో మ్యాచ్ మొదలయ్యే క్షణం దాకా ఈ భారం మోయలేకే ఓపెనింగ్ జోడీని కెప్టెన్ కోహ్లి తేల్చేశాడు. రోహిత్ తోడుగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ఆరంభిస్తాడని స్పష్టం చేశాడు. గత కొన్ని మ్యాచ్లుగా రోహిత్-రాహుల్ జోడీ అదిరే ఆరంభాలను ఇచ్చిందని.. ఇదే జంటను ఈ సిరీస్లో కొనసాగిస్తున్నట్లు.. శిఖర్ ధావన్ రిజర్వ్గా ఉంటాడని పేర్కొన్నాడు. ఒకవేళ రోహిత్-రాహుల్ ఇద్దరిలో ఎవరికైనా గాయాలు అయితే అప్పుడు శిఖర్ ఓపెనింగ్కు వస్తాడని విరాట్ చెప్పాడు.
బ్యాటింగ్ ఆర్డర్లో ప్రతీ స్థానంలోనూ మునుపెన్నడు లేనంత తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో జట్టుకు ఎంపికైనప్పటికీ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లు ఆడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలు ఖాయమైన తుది జట్టులో వాళ్లిద్దరికి చోటు అసాధ్యమే. లోకల్ బాయ్ అక్షర్ పటేల్ కంటే బ్యాటింగ్లో మెరుగైన వాషింగ్టన్ సుందర్వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. పేస్ విభాగంలో భువీ, శార్దుల్, సైనీలున్నారు.

అంతా కొట్టేవాళ్లే
ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ భారత్ కంటే కాస్త మెరుగనే చెప్పాలి. తుది జట్టుకు ఆడే 11 మందిలో పది మందికి బ్యాటింగ్, హిట్టింగ్ బాగా తెలుసు. ఓపెనర్లు జేసన్ రాయ్, బట్లర్లతో పాటు టి20 స్పెషలిస్టు డేవిడ్ మలన్, బెయిర్ స్టో, ఆల్రౌండర్ స్టోక్స్, కెప్టెన్ మోర్గాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్చర్ దాకా ఆడేసేవాళ్లే అందుబాటులో ఉన్నారు. భారత్ స్పిన్ దెబ్బతీసినా... కాసిన్ని ఓవర్ల (20)లో పదో వరుస దాకా ఉన్న బ్యాటింగ్ బలం జట్టుకు వరం. బౌలింగ్లో రషీద్, జోర్డాన్, మొయిన్ అలీలు భారత బ్యాట్స్మెన్కు తప్పకుండా సవాళ్లు విసురుతారు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య సాగే ఐదు మ్యాచ్ల సిరీస్ ఆద్యంతం రసవత్తరంగానే సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బ్యాటింగ్ పిచ్
మొతేరా పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది. మూడు, నాలుగు టెస్టులకు ఉపయోగించిన పిచ్తో పోలిస్తే ఈ పిచ్ భిన్నంగా ఉండబోతోంది. ఈ ట్రాక్పై బ్యాట్స్మెన్కు పరుగుల పండగ ఖాయం. అయితే ఈ జనవరిలో ముస్తాక్ అలీ టోర్నీ ఆడినప్పుడు పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందింది. ఇక్కడ ఏడు మ్యాచ్లు జరగ్గా అయిదింట్లో తొలుత బౌలింగ్ చేసిన జట్టే నెగ్గింది. ఈ నేపథ్యంలో టాస్ కీలకం కాబోతోంది.

జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, శ్రేయస్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్, సైనీ.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బట్లర్, మలన్, బెయిర్స్టో, స్టోక్స్, మొయిన్ అలీ, సామ్ కరన్, జొర్డాన్, ఆర్చర్, మార్క్వుడ్, రషీద్.


Click it and Unblock the Notifications












