
చెన్నై: భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇంగ్లండ్ ఆలౌట్ ముంగిట నిలిచింది. అశ్విన్, అక్షర్ స్పిన్ ధాటికి భారత ఆటగాళ్ల సూపర్ ఫీల్డింగ్ కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ వరుసగా పెవిలియన్కు క్యూ కడుతున్నారు. దాంతో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 49.2 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. క్రీజులో బెన్ ఫోక్స్(23 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకు ముందు ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఇషాంత్ శర్మ ధాటికీ ఖాతా తెరవకుండా ఓపెనర్ రోరీ బర్న్స్(0) వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత అశ్విన్.. మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(16), డాన్ లారెన్స్(9), బెన్ స్టోక్స్(9), ఓలి స్టోన్(1)ను పెవిలియన్ చేర్చగా.. జోరూట్(6), మొయిన్ అలీ(6)లను అక్షర్ ఔట్ చేశాడు. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ఓలి పోప్(22)ను రిషభ్ పంత్ సూపర్ క్యాచ్ సాయంతో సిరాజ్ పెవిలియన్కు చేర్చడంతో ఇంగ్లండ్ ఆలౌట్ ముంగిట నిలిచింది.
అంతకు ముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 329 పరుగులకు ఆలౌటైంది. ఓ వైపు డాషింగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(77 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్లతో 58 నాటౌట్) ధాటిగా ఆడినా.. మరోవైపు ఓలిస్టోన్(3/47) దెబ్బకు టెయిలండర్లు నిలబడలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ(4/128) నాలుగు వికెట్లు తీయగా.. ఓలీ స్టోన్ మూడు, జాక్ లీచ్(2/78) రెండు వికెట్లు తీశారు. జోరూట్కు ఓ వికెట్ దక్కింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లు ఒక్క ఎక్స్ట్రా కూడా ఇవ్వలేదు. కాగా భారత ఇన్నింగ్స్లో ఐదుగురు డకౌటయ్యారు.