
అక్షర్ అదరహో..
33 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజాకు గాయం కావడం వల్ల అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్.. అద్భుత బౌలింగ్తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఆడుతున్నది రెండో టెస్టే అయినా నాలుగు ఇన్నింగ్స్ల్లో మొత్తం మూడు సార్లు ఐదు వికెట్లతో మెరిశాడు. ఇప్పటివరకు 19 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ బాల్కే జాక్ క్రాలీ(0)ని క్లీన్ బౌల్డ్ చేసిన అక్షర్.. మూడో బంతికి బెయిర్ స్టోను కూడా బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ ఖాతా తెరవకుముందే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం డామ్ సిబ్లీ(7)ని కూడా అక్షర్గా కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. సిబ్లీ రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

చెలరేగిన అశ్విన్
ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్(25)తో జోరూట్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. దాంతో ఇంగ్లండ్ 50 పరుగులు పూర్తి చేసుకుంది. అయితే క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని అశ్విన్ విడదీశాడు. స్టోక్స్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్కు చేర్చాడు. స్టోక్స్ను అశ్విన్ ఔట్ చేయడం ఇది 11వసారి. ఆ వెంటనే జోరూట్(19)ను అక్షర్ ఎల్బీగా ఔట్ చేసి ఈ మ్యాచ్లో 10 వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓలిపోప్(12), జోఫ్రా ఆర్చర్(0), జాక్ లీచ్(9) అశ్విన్ ఔట్ చేయగా.. బెన్ ఫోక్స్(8)ని అక్షర్ పటేల్ పెలియన్ చేర్చాడు. చివరి వికెట్గా అండర్సన్ను సుందర్ క్యాచ్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

అశ్విన్400
ఆర్చర్ వికెట్ తీసిన అశ్విన్.. సుదీర్ఘ ఫార్మాట్లో 400 వికెట్ల క్లబ్లో చేరాడు. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బౌలర్గా రికార్డు కెక్కాడు. అశ్విన్ కన్నా ముందు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ ఈ ఘనతను అందుకున్నాడు. మురళీ ధరణ్ 72 టెస్ట్ల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకుంటే.. అశ్విన్ 77 టెస్ట్ల్లో ఈ ఘనతను సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ 80 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించాడు.

145 ఆలౌట్..
అంతకుముందు 99/3 ఓవర్నైట్ స్కోర్తో సెకండ్ డే ఆటను కొనసాగించిన భారత్.. ఫస్ట్ ఇన్నింగ్స్లో 145 పరుగులకు ఆలౌటైంది. దాంతో కోహ్లీసేనకు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్(5/8), స్పిన్నర్ జాక్ లీచ్(4/54) భారత్ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీ మినహా అంతా విఫలమయ్యారు. ఓవర్నైట్ స్కోర్కు 46 పరుగుల మాత్రమే జోడించిన భారత్.. మిగతా ఏడు వికెట్లను జోరూట్, లీచ్లకు సమర్పించుకుంది. ఓవర్నైట్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే(25 బంతుల్లో 7), రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66), వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(8 బంతుల్లో 1), సుందర్(0), అక్షర్ పటేల్(0), రవిచంద్రన్ అశ్విన్(17) వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. చివర్లో ఇషాంత్(10) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా బుమ్రా(1) ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.


Click it and Unblock the Notifications
