
337 పరుగులకు ఆలౌట్
సోమవారం నాలుగో రోజు ఉదయం 6 వికెట్లకు 257 పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. మరో 80 పరుగులు జోడించి (337) మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (85 నాటౌట్; 138 బంతుల్లో 12x4, 2x6)) అద్భుత పోరాటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ (31; 91 బంతుల్లో 3x4, 1x6) కూడా తన వంతు పాత్ర పోషించాడు. యాష్ అవుటైన తర్వాత అవతలి వైపు బ్యాట్స్మెన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో సుందర్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

తొలి బంతికే వికెట్
భారత్కు ఫాలోఆన్ ఇచ్చే అవకాశమున్నా.. బౌలర్ల అలసటను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించాలని నిర్ణయించింది. అయితే 241 పరుగుల భారీ ఆధిక్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్కు స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌటయ్యాడు. అనంతరం సిబ్లీ, లారెన్స్ కాసేపు వికెట్ కాపాడుకోవడానికి ప్రయతించారు. అయితే అశ్విన్ వేసిన ఓ అద్భుత బంతికి సిబ్లీ (12) పుజారా చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ 32 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది.

ఆదుకున్న రూట్
ఈ సమయంలో కెప్టెన్ జో రూట్ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇషాంత్ శర్మ బౌలింగ్లో లారెన్స్ (18) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇషాంత్కిది టెస్టుల్లో 300వ వికెట్ కావడం విశేషం. ఆ వెంటనే స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (7)ను అశ్విన్ ఔట్ చేశాడు. 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో రూట్, పోప్ కాసేపు జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఈ జోడీని 24వ ఓవర్లో బుమ్రా విడదీశాడు. రూట్ (40)ను అతడు పెవిలియన్ చేర్చాడు. ఆపై పోప్, బట్లర్ కాసేపు ఆచితూచి ఆడారు. అనంతరం అశ్విన్, నదీమ్ చెలరేగడంతో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

టీమిండియాకు భారీ షాక్
420 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ఆరంభించారు. రోహిత్ శర్మ పుల్ షాట్తో సిక్సర్ బాది మంచి లయలో కనిపించాడు. శుభ్మన్ గిల్ బౌండరీలు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే స్పిన్నర్ జాక్ లీచ్ చక్కని బంతితో రోహిత్ను క్లీన్బౌల్డ్ చేసి టీమిండియాకు భారీ షాకిచ్చాడు. అనంతరం వన్డౌన్లో వచ్చిన పుజారాతో కలిసి గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ నాలుగో రోజు ఆటను ముగించాడు. సోమవారం ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్లో భారత్ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఆఖరి రోజు 381 పరుగులు చేయాలి. క్రీజులో గిల్ (15; 35 బంతుల్లో, 3×4), పుజారా (12; 23 బంతుల్లో, 1×4) ఉన్నారు.

స్కోరు వివరాలు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 578 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 337 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 178 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 39/1
'కోహ్లీ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. 1 లేదా 2 సెంచరీలు చేస్తాడు'


Click it and Unblock the Notifications












