India vs England: చెలరేగిన స్పిన్నర్లు.. భారత్ ఘన విజయం!

అహ్మదాబాద్: భారీ అంచనాల మధ్య మొదలైన భారత్-ఇంగ్లండ్ డే/నైట్ టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. స్పిన్నర్లకు స్వర్గధామంగా నిలిచిన మొతెరా వికెట్పై బౌలర్లు చెలరేగడంతో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. మరోసారి అక్షర్ పటేల్ (5/32), రవిచంద్రన్ అశ్విన్(4/48) బంతితో మ్యాజిక్ చేయడంతో ఇంగ్లండ్ చిత్తయింది. 49 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 25 నాటౌట్), శుభ్మన్ గిల్(21 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్తో 15 నాటౌట్) రాణించారు. హిట్మ్యాన్ తనదైన శైలిలో సిక్స్తో మ్యాచ్ ముగించాడు.
ఈ విజయంతో నాలుగు టెస్ట్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తద్వారా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ అవకాశాలను కోహ్లీసేన సజీవంగా ఉంచుకుంది. చివరి టెస్ట్లో గెలవకున్నా.. డ్రా చేసుకుంటే సరిపోతుంది. అయితే ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

భారత్ 145 ఆలౌట్..
అంతకుముందు 99/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. ఫస్ట్ ఇన్నింగ్స్లో 145 పరుగులకు ఆలౌటైంది. దాంతో కోహ్లీసేనకు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్(5/8), స్పిన్నర్ జాక్ లీచ్(4/54) భారత్ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీ మినహా అంతా విఫలమయ్యారు. ఓవర్నైట్ స్కోర్కు 46 పరుగుల మాత్రమే జోడించిన భారత్.. మిగతా ఏడు వికెట్లను జోరూట్, లీచ్లకు సమర్పించుకుంది.
ఓవర్నైట్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే(25 బంతుల్లో 7), రోహిత్ శర్మ(96 బంతుల్లో 11 ఫోర్లతో 66), వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్(8 బంతుల్లో 1), సుందర్(0), అక్షర్ పటేల్(0), రవిచంద్రన్ అశ్విన్(17) వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. చివర్లో ఇషాంత్(10) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా బుమ్రా(1) ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఖాతా తెరవకుండానే..
33 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ ఓవర్లో లోకల్ బాయ్ అక్షర్ పటేల్ గట్టిషాక్ ఇచ్చాడు.
ఫస్ట్ బాల్కే జాక్ క్రాలీ(0)ని క్లీన్ బౌల్డ్ చేసిన అక్షర్.. మూడో బంతికి బెయిర్ స్టోను కూడా బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ ఖాతా తెరవకుముందే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం డామ్ సిబ్లీ(7)ని కూడా అక్షర్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. సిబ్లీ రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

చెలరేగిన అశ్విన్
ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్(25)తో జోరూట్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. దాంతో ఇంగ్లండ్ 50 పరుగులు పూర్తి చేసుకుంది. అయితే క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని అశ్విన్ విడదీశాడు. స్టోక్స్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్కు చేర్చాడు. స్టోక్స్ను అశ్విన్ ఔట్ చేయడం ఇది 11వసారి. ఆ వెంటనే జోరూట్(19)ను అక్షర్ ఎల్బీగా ఔట్ చేసి ఈ మ్యాచ్లో 10 వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓలిపోప్(12), జోఫ్రా ఆర్చర్(0), జాక్ లీచ్(9) అశ్విన్ ఔట్ చేయగా.. బెన్ ఫోక్స్(8)ని అక్షర్ పటేల్ పెలియన్ చేర్చాడు. చివరి వికెట్గా అండర్సన్ను సుందర్ క్యాచ్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఇంగ్లండ్ చెత్త రికార్డు..
ఈ మ్యాచ్లో బౌలింగ్లో రాణించిన ఇంగ్లండ్ బ్యాటింగ్లో మాత్రం దారుణంగా విఫలమైంది. భారత్ స్పిన్ ధ్వయం ధాటికి ఫస్ట్ ఇన్నింగ్స్లో 112 పరుగులకే ఆలౌటైన జోరూట్ సేన.. సెకండ్ ఇన్నింగ్స్లో మరి దారుణంగా 81 పరుగులకే కుప్పకూలింది. ఈ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఓవరాల్గా 193 పరుగులు చేసింది. ఫలితంగా 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లీష్ జట్టు స్వల్ప స్కోర్ నమోదు చేసింది. 1983-84లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 93 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్లో 82 పరుగులకే కుప్పకూలింది. అప్పట్లో ఆ రెండు ఇన్నింగ్స్లు కలిపి 175 పరుగులు మాత్రమే చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications