
పుణే: ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ భారత్ టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ మళ్లీ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్ల్లో కోహ్లీ టాస్ ఓడిపోవడం గమనార్హం. ఇక అంతా అనుకున్నట్లు భారత జట్టులో పెద్దగా మార్పులు జరగలేదు. సెకండ్ వన్డేలో ధారళంగా పరుగులిచ్చిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై వేటు వేసిన టీమిండియా.. యువ పేసర్ నటరాజన్ను జట్టులోకి తీసుకొచ్చింది. గత మ్యాచ్లో విఫలమైన కృనాల్కు టీమ్మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది.
ఇక ఈ మ్యాచ్లోనూ సూర్యకుమార్ యాదవ్, చాహల్కు మొండిచేయ్యే ఎదురైంది. టాస్ ఓడిపోవడమనేది తమ చేతుల్లో లేనిదని, తాము కూడా బౌలింగ్ తీసుకుందామని భావించామని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. టెస్ట్, టీ20 సిరీస్లో కమ్ బ్యాక్ చేశామని, కానీ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితన్నాడు. మరోవైపు ఇంగ్లండ్ జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. టామ్ కరన్ స్థానంలో మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడు.
ఇంగ్లండ్ లాంటి మేటి జట్టు ముందు 336 పరుగుల స్కోరు కూడా సరిపోదని రెండో వన్డేలోనే టీమిండియాకు అర్థమైంది. బ్యాటింగ్లో రాణించిన టీమిండియా భారీ స్కోరు చేస్తే... ప్రపంచ చాంపియన్ జట్టు తమ స్థాయికి తగ్గట్లుగా ఆడి దానిని అలవోకగా ఛేదించింది. ఈ నేపథ్యంలో మరోసారి పరుగుల పండగకు భారత్, ఇంగ్లండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. గత మ్యాచ్ అనుభవంతో వ్యూహం మార్చి విజయాన్ని అందుకోవాలని భారత్ ఆశిస్తుండగా... ఈ పర్యటనలో చివరి మ్యాచ్లో నెగ్గి ఒక్క ఫార్మాట్లోనైనా విజేతగా వెనుదిరగాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది.
తుది జట్లు
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, పంత్, హార్దిక్, కృనాల్, నటరాజన్, భువనేశ్వర్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, బెయిర్స్టో, స్టోక్స్, మలాన్, లివింగ్స్టోన్, అలీ, స్యామ్ కరన్, ఆదిల్ రషీద్, టాప్లీ, వుడ్.