
చెన్నై: రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్లో టీమిండియా విజయానికి చేరువైంది. 482 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ రెండు వికెట్ల తీయగా లోకల్ బాయ్ అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. క్రీజులో జో రూట్ ( 2 బ్యాటింగ్), లారెన్స్ (19 బ్యాటింగ్) ఉన్నారు.
అంతకుముందు 52/1 స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్(148 బంతుల్లో 14 ఫోర్లు ఒక సిక్స్తో 106) వీరోచిత సెంచరీకి తోడు విరాట్ కోహ్లీ(149 బంతుల్లో 7 ఫోర్లతో 62) బాధ్యతాయుత ఇన్నింగ్స్తో రాణించాడు. చివర్లో సిరాజ్(16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
చివర్లో మహ్మద్ సిరాజ్(21 బంతుల్లో 2 సిక్సర్లతో 16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్(4/100), మొయిన్ అలీ(4/98) నాలుగేసి వికెట్లు తీయగా.. ఓలి స్టోన్(1/21) ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 195 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్కు టీమిండియా 482 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్లు సిబ్లీ(1), రోరీ బర్న్స్(25) వికెట్లు కోల్పోయింది.
అక్షర్ బౌలింగ్లో సిబ్లీ ఎల్బీ కాగా.. అశ్విన్ బౌలింగ్లో బర్న్స్ కోహ్లీకి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే నైట్ వాచ్ మన్గా వచ్చిన జాక్ లీచ్(0)ను అక్షర్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన జోరూట్ .. డాన్ లారెన్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ ఇంకా 429 పరుగులు చేయాలి. భారత బౌలర్ల దూకుడు చూస్తుంటే నాలుగో రోజు ఆట ఫస్ట్ సెషన్లోపే మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది.