
చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(6), శుభ్మన్ గిల్(29) తీవ్రంగా నిరాశపరిచారు. ఈ ఇద్దర్ని జోఫ్రా ఆర్చరే పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 14 ఓవర్లలో 2 వికెట్లకు 59 పరుగులు చేసింది.క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(4), చతేశ్వర్ పుజారా(20) ఉన్నారు.
తొలుత రోహిత్ శర్మను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చిన ఆర్చర్.. ఆ తర్వాత వరుస బౌండరీలతో దూకుడు కనబర్చిన శుభ్మన్ గిల్ను అండర్సన్ సూపర్ క్యాచ్ సాయంతో ఔట్ చేశాడు. అనంతరం పుజారా, కోహ్లీ నిలకడగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు.
అంతకుముందు ఇంగ్లండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో 578 పరుగులకు ఆలౌట్ అయింది. 555/8 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన రూట్ సేన మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్ను ముగించింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ జో రూట్ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్ (118 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), డామ్ సిబ్లీ(87) శతకాలను చేజార్చుకున్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మూడేసి వికెట్లు తీయగా.. షబాజ్ నదీమ్, ఇషాంత్ రెండు వికెట్లు పడగొట్టారు.