
చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 337 పరుగులకు ముగిసింది. వాషింగ్టన్ సుందర్ (138 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా.. అతనికి మరో ఎండ్లో సహకారం లభించలేదు. దాంతో ఇంగ్లండ్కు 241 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక 257/6 ఓవర్ నైట్ స్కోర్తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన భారత్.. సుందర్, అశ్విన్(31) అశ్విన్ సూపర్ బ్యాటింగ్తో 300 పరుగుల మార్క్ను ధాటగలిగింది.
డామ్ బెస్ బౌలింగ్లో మిడాన్ మీదుగా అశ్విన్ అద్భుత సిక్సర్ కొట్టగా.. మరోవైపు సుందర్ కూడా ధాటిగా ఆడటంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఈ క్రమంలో 82 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో సుందర్ కెరీర్లో రెండో అర్థశతకాన్ని అందుకున్నాడు. కానీ కొత్త బంతి అందుకున్న తర్వాత సీన్ రివర్స్ అయింది. పేసర్లతో వరుసగా ఓవర్లు వేయించి కట్టడి చేసిన రూట్.. ఆ వెంటనే లీచ్ను బరిలోకి దింపి ఫలితం రాబట్టాడు. లీచ్ బౌలింగ్లో అనూహ్యంగా వచ్చిన బౌన్స్ను ఆడే క్రమంలో అశ్విన్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో ఆరో వికెట్కు నమోదైన 85 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత మరో 32 పరుగుల వ్యవధిలోనే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓవైపు సుందర్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేసినా.. మరోవైపు షబాజ్ నదీమ్(0), ఇషాంత్ శర్మ(4), జస్ప్రీత్ బుమ్రా(0) తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో సుందర్ సెంచరీ చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో డామ్ బెస్(4/76) నాలుగు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్(2/75), జేమ్స్ అండర్సన్ (2/46), జాక్ లీచ్ (2/105) రెండేసి అనంతరం ఫాలో ఆన్కు ఆహ్వానించకుండా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్.. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ రోరీ బర్న్స్(0) వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే బర్న్స్ అశ్విన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి డాన్ లారెన్స్(0) రాగా.. ఇంగ్లండ్ 1/1తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.