
శుభారంభం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధావన్(56 బంతుల్లో 10 ఫోర్లతో 67), రోహిత్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లతో 37) మంచి శుభారంభాన్ని అందించారు. ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో పవర్ ప్లే ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. అనంతరం అదే జోరు కనబర్చిన ఈ జోడీ.. వరుస బౌండరీలతో చెలరేగింది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ 44 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని ఆదిల్ రషీద్ విడదీశాడు. వరుస ఓవర్లలో ఈ ఇద్దరిని పెవిలియన్కు చేర్చాడు. రోహిత్ను క్లీన్ బౌల్డ్ చేసిన రషీద్.. శిఖర్ ధావన్ను రిటర్న్ క్యాచ్గా వెనక్కిపంపాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(7)ని మోయిన్ అలీ క్లీన్ బౌల్డ్ చేసి గట్టి దెబ్బకొట్టాడు. దాంతో భారత్ 121 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆదుకున్న రిషభ్ పంత్
ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 78), కేఎల్ రాహుల్(7) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ అనూహ్యంగా పార్ట్టైమ్ స్పిన్నర్ లివింగ్స్టన్ను దింపిన జోస్ బట్లర్ ఫలితాన్ని రాబట్టాడు. రాహుల్(7)ను క్యాచ్ఔట్గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి రిషభ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లివింగ్స్టన్ బౌలింగ్లో పంత్ 6, 4 కొట్టగా.. మోయిన్ అలీ వేసిన ఆ మరుసటి ఓవర్లో పాండ్యా మూడు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో రషీద్ వేసిన 31వ ఓవర్ ఐదో బంతిని భారీ సిక్సర్గా మలచి 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

చెలరేగిన పాండ్యా..
క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని సామ్ కరన్ విడదీశాడు. అతని ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన పంత్ అదే జోరులో మరో షాట్ ఆడబోయి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం కృనాల్ పాండ్యా క్రీజులోకి రాగా.. రన్ రేట్ తగ్గకుండా హార్దిక్ జాగ్రత్తపడ్డాడు. అదే జోరు కొనసాగిస్తూ.. రషీద్ బౌలింగ్లో సింగిల్ తీసి 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే భారీ సిక్సర్ కొట్టిన హార్దిక్.. బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఫోర్ కొట్టి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

శార్దూల్ మెరుపులు..
క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ (21 బంతుల్లో 3 సిక్స్లతో 1 ఫోర్తో 30) వచ్చి రావడంతో ఓ భారీ సిక్సర్ కొట్టి ఖాతా తెరిచాడు. కృనాల్తో కలిసి ధాటిగా ఆడాడు. టోప్లీ, స్టోక్స్ బౌలింగ్లో భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే శార్దూల్ జోరు చూస్తే భారత్ సులువుగా 350కి పైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ అతని జోరుకు మార్క్ వుడ్ బ్రేక్ వేసాడు. కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా(25),ప్రసిధ్ కృష్ణ(0), భువనేశ్వర్ కుమార్(4) వరుసగా ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ముగిసింది.


Click it and Unblock the Notifications
