
పుణె: ఆద్యాంతం ఉత్కంఠ రేపిన సిరీస్ డిసైడర్ వన్డేలో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ను 7 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన భారత్ మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఓవరాల్గా వరుసగా మూడు సిరీస్లు నెగ్గి ఇంగ్లండ్ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆఖరి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. ఫీల్డింగ్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టులో బెస్ట్ ఫీల్డర్ అయిన హార్దిక్.. నిన్నటి మ్యాచ్లో ఏకంగా రెండు సునాయస క్యాచ్లు నేలపాలు చేశాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బెన్స్టోక్స్ ఇచ్చిన సునాయస క్యాచ్ను హార్దిక్ పాండ్యా వదిలేశాడు. లైఫ్ దొరికితే స్టోక్స్ ఎంత ప్రమాదకారిగా మారతాడో రెండో మ్యాచ్లో అందరూ చూశారు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మ్యాచ్ భారత్ చేజారింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో అతని క్యాచ్ను మిస్ చేయగానే, ఎంత పెద్ద పొరపాటు చేశానన్నట్లుగా హార్దిక్ విస్మయం వ్యక్తం చేశాడు.
ఇక పదకొండో ఓవర్లో నటరాజన్ వేసిన బంతిని షాట్ ఆడిన స్టోక్స్, గాల్లోకి లేపగా మిడ్ వికెట్లో ఉన్న ధావన్ ఏమాత్రం తడబడకుండా ఒడిసిపట్టాడు. దాంతో ఊపిరి పీల్చుకున్న హార్దిక్.. గబ్బర్కు వంగి వంగి దండాలు పెట్టాడు. మోకాళ్ల మీద కూర్చుని మరీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక పాండ్యా దండం పెట్టడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందించింది. గబ్బర్ తరఫున పాండ్యా కృతజ్ఞతలకు వెల్కమ్ చెప్పింది.
ఇక తనదైన బ్యాటింగ్తో భారత్ను వణికించిన సామ్ కరన్ క్యాచ్ను కూడా హార్దిక్ నేలపాలు చేశాడు. దానికి 19వ ఓవర్ బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి బదులు తీర్చుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా.. నటరాజన్ సూపర్ యార్కర్లతో కట్టడి చేసి కేవలం 6 పరుగులే ఇవ్వడంతో భారత్ విజయం లాంఛనమైంది.