టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్-2 మ్యాచ్కు భారీ అడ్డంకి ఏర్పడింది. భారత కాలమానం ప్రకారం గయానా వేదికగా గురువారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.
గయానా వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. 88 శాతం వర్షం వచ్చే సూచనలు ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే నిజమైతే వర్షం కారణంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ రద్దవుతోంది. సెమీఫైనల్-2కు రిజర్వ్ డే లేదు. కానీ వెయిటింగ్ సమయం ఎక్కువగా ఉంది. ఏడు గంటల 20 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు.

ఈ సమయంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాక రద్దయితే పాయింట్స్ టేబుల్లో ఇంగ్లండ్ కంటే ముందున్న టీమిండియా ఫైనల్కు అర్హత సాధిస్తోంది. ఐసీసీ రూల్స్ ప్రకారం కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయిన నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఇరు జట్లు 5 ఓవర్లు ఆడలేని పరిస్థితి ఉంటే రద్దు చేస్తారు.
ఒక వేళ మ్యాచ్ మధ్యలో వర్షం అంతరాయం కలిగిస్తే.. అప్పటికే ఇరు జట్లు 5 ఓవర్ల ఆటను పూర్తి చేసి ఉంటే డక్ వర్త్ లూయిస్ పద్దతిన ఫలితాన్ని తేల్చుతారు. ఆట సాధ్యమైతే ఓవర్లను కుదించి ఆడిస్తారు. వర్షం పరిస్థితుల్లో మ్యాచ్ ఆడటం ఇరు జట్లకు సవాల్తో కూడుకున్న విషయమే. వర్షం పరిస్థితులు, డక్వర్త్ లూయిస్ లెక్కలను మదిలో పెట్టుకొని ఆడాల్సి ఉంటుంది.
గత ఎడిషన్ టీ20 ప్రపంచకప్ 2022లోనూ ఇంగ్లండ్, భారత్ సెమీఫైనల్లోనే తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్లో పాక్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. అయితే ఈసారి ఇంగ్లండ్ కంటే టీమిండియానే హాట్ ఫేవరేట్గా కనబడుతోంది.
సెమీస్ రికార్డ్స్..
జస్ప్రీత్ బుమ్రాతో పాటు రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉండటం టీమిండియాపై అంచనాలను పెంచుతోంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా ఇప్పటికీ నాలుగు సార్లు సెమీస్ చేరింది. రెండు సార్లు గెలిచి మరో రెండు సార్లు ఓటమిపాలైంది. 2007 టీ20 ప్రపంచకప్లో సెమీస్లో ఆసీస్ను ఓడించి ఫైనల్ చేరిన టీమిండియా.. టైటిల్ ఫైట్లో పాక్ను మట్టికరిపించి విజేతగా నిలిచింది.
2014 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్ చేరిన టీమిండియా.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. 2016 టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్ చేతిలో ఓడిన టీమిండియా.. 2022 ప్రపంచకప్లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది.